డేరా బాబాకు రాజభోగాలు: తోటి ఖైదీ చెప్పిన సంచలన విషయాలు
ఎన్నో ఘోరాలతోపాటు ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా (గుర్మీత్ రాం రహీమ్ సింగ్) రోహ్తక్ సునారియా జైలులో రాజభోగాలు అనుభవిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
సిర్సా: ఎన్నో ఘోరాలతోపాటు ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా (గుర్మీత్ రాం రహీమ్ సింగ్) రోహ్తక్ సునారియా జైలులో రాజభోగాలు అనుభవిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల జైలునుంచి విడుదలైన ఓ నిందితుడు రాహుల్ జైన్ ఇందుకు సంబంధించి పలు ఆశ్చర్యకర విషయాలు వెల్లడించాడు.
ప్రత్యేక సౌకర్యాలు..
తోటమాలిగా పనిచేస్తున్నందుకు డేరా బాబాకు రోజుకు రూ. 20 చొప్పున ఇస్తున్నామని పోలీసులు చెప్పినదాంట్లో వాస్తవం లేదని ఆయన తెలిపాడు. 'ముందుగా గుర్మీత్కు జైలులో ప్రత్యేక గది ఇచ్చారు. ఆ గది చుట్టుపక్కలకు కూడా ఇతర ఖైదీల్ని అనుమతించేవారు కాదు. ఆపై కావాలసినప్పుడల్లా పాలు, మినరల్ వాటర్, జ్యూస్లు అందిస్తున్నారు' అని జైన్ తెలిపాడు.
2-3గంటలపాటు
‘ఇంకా చెప్పాలంటే సాధారణ ఖైదీల బంధువులు, సన్నిహితులు జైలుకు వస్తే కేవలం 20 నిమిషాలు మాత్రమే ఖైదీల్ని కలిసేందుకు పర్మిషన్ ఇస్తారు. కానీ, డేరా బాబా మాత్రం 2 నుంచి 3గంటలపాటు తనను కలిసేందుకు వచ్చేవారితో ముచ్చటిస్తాడు' అని రాజేష్ చెప్పాడు.
అంతా అబద్ధం..
‘అంతేగాక, బాబా ఏ పని చేయడం లేదని, కానీ తోటమాలిగా చేస్తున్నందుకు రోజుకు 20రూపాయలు గుర్మీత్కు ఇస్తున్నట్లు అందర్ని నమ్మిస్తున్నారు' అని జైలులో ఉన్పప్పుడు గుర్మీత్ తోటి ఖైదీ అయిన రాహుల్ వివరించాడు.
కుటుంబ సభ్యుల చర్చలు.. ఖండన
కాగా, గుర్మీత్ను కలిసేందుకు సోమవారం కూడా ఆయన కుటుంబసభ్యులు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే వారు ఎందుకు కలిశారు, గుర్మీత్తో ఏం మాట్లాడారన్న దానిపై పోలీసులు, జైలు అధికారులు నోరు మెదపడం లేదని సమాచారం. కాగా, రాహుల్ జైన్ ఆరోపణలపై స్పందించారు జైళ్ల శాఖ మంత్రి కృష్ణలాల్ పన్వర్. జైళ్లలో ఎవరికీ వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. సాధారణ ఖైదీలాగే డేరాబాబా కూడా శిక్ష అనుభవిస్తున్నాడని తెలిపారు. జైన్ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదిన అన్నారు.