స్పెషల్ కిట్స్ :లైంగిక దాడుల కేసుల్లో వేగవంతమైన విచారణకోసం ప్రత్యేక కిట్లు
దేశంలో పెరిగిపోతున్న అత్యచారాలపై ప్రత్యేక దృష్టి సారించింది కేంద్రం. అత్యాచారం జరిగిన తర్వాత విచారణ వేగవంతం చేసేందుకు పోలీసులకు ప్రత్యేక కిట్లను సమకూర్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రేప్ ఇన్వెస్టిగేషన్ కిట్స్ పేరుతో 5వేల కిట్లను దేశవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లకు అందజేసింది. అత్యాచార ఘటనల్లో విచారణ వేగవంతం చేసేందుకే ఈ కిట్లను అందిస్తున్నట్లు మహిళా శిశు అభివృద్ధి శాఖ తెలిపింది.
ప్రస్తుతం ప్రతి పోలీస్ స్టేషన్కు ఐదు కిట్లను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఏర్పాట్లను చేసేందుకు ముందుకు రావాలని వారు కోరారు. ప్రతి కిట్లో టెస్ట్ ట్యూబ్ సెట్, బాటిల్స్ ఉంటాయని... వాటి ధర రూ.200 నుంచి రూ. 300 ఉండొచ్చని చెప్పారు. అలాంటి కిట్లను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసి పోలీస్ స్టేషన్లలో ఇవ్వాలని గతవారం కేంద్ర మంత్రి మేనకాగాంధీ కోరారు. మేనకాగాంధీ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు చెప్పిన అధికారులు.... హర్యానా ప్రభుత్వం ఇప్పటికే ఆ కిట్లను కొనుగోలు చేస్తున్నట్లు ధృవీకరించిందని స్పష్టం చేశారు.
అత్యాచారం ఘటన జరిగిన తర్వాత అంతా రాజీకొచ్చాక అప్పుడు ఎవిడెన్సులు ఫోరెన్సిక్ లేబొరేటరీలకు చేరుకుంటున్నాయని దీనివల్ల ఉపయోగం ఉండదని అధికారులు చెబుతున్నారు. అందుకోసమే పోలీస్ స్టేషన్లకు కిట్లను సరఫరా చేస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వివరించారు. ఈ కిట్లలోని పరికరాలతో అత్యాచారం ఘటన జరిగనట్లు సమాచారం అందగానే బాధితురాలి బ్లడ్ శాంపిల్స్, సీమెన్, చెమట నమూనాలను సేకరించి భద్రపరిచి ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలిస్తామని చెప్పారు. ఈ కేసును డీల్ చేస్తున్న పోలీసు అధికారి పేరు, బాధితురాలికి వైద్యం చేసిన డాక్టరు పేరు కూడా ఉంటుందన్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు 13వేల అత్యాచారం కేసుల్లో ఫోరెన్సిక్ విశ్లేషణ లేదని అన్నారు మంత్రి మేనకాగాంధీ. ఈ వ్యవస్థలో ఉన్న లొసుగులకు పరిష్కారం కనుగొని అత్యాచార ఘటనల్లో వేగవంతమైన విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం పరీక్షలు నిర్వహించేందుకు 1500 మందికి సరిపడా ఫోరెన్సిక్ ల్యాబ్ మాత్రమే ఉందని.. కేంద్ర హోంశాఖ సహాయంతో 5 కొత్త ల్యాబ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు.