చిన్నారులపై లైంగికదాడులే కాని.. మిడిల్ ఏజ్ మహిళలపై... యూపీ మంత్రి కాంట్రవర్సీ కామెంట్లు
లక్నో : ఇటీవల యూపీ, మధ్యప్రదేశ్లో చిన్నారులపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. పసిమొగ్గలను కాటేస్తూ .. తర్వాత గొంతు నులిమి హతమార్చిన ఘటనలు కళ్లముందే కదలాడుతున్నాయి. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన పాలకులు .. కొన్నిసార్లు నోటిదురుసు ప్రదర్శిస్తున్నారు. తాజాగా యూపీ మంత్రి చిన్నారుల లైంగికదాడులపై నోరుపారేసుకున్నారు.
రేపే కానీ ... మిడిల్ ఏజ్ ..?
యూపీలో చిన్నారులపై లైంగికదాడులు పెరిగాయి. దీంతో రాష్ట్రానికి చెందిన అటవీశాఖ మంత్రి ఉపేంద్ర తివారీని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. లైంగికదాడుల అంశం గురించి ప్రస్తావించగా .. చిన్నారులపై లైంగికదాడి రేపే .. కానీ అని ముక్తాయించారు. పెళ్లైన మహిళలపై జరిగే లైంగికదాడి వేరు అని పరోక్షంగా అతివలను కించపరిచారు. అంతేకాదు లైంగికదాడి అనేది ప్రకృతిపరంగా జరిగే ఘటన అని తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే చిన్నారులపై అఘాయిత్యం మాత్రం లైంగికదాడి కిందకే వస్తుందని నొక్కి వక్కానించారు. కానీ మధ్య వయస్సు మహిళ విషయానికి వచ్చేసరికి అర్థం, పరమార్థం మారిపోతుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో చిన్నారులపై జరిగిన లైంగికదాడుల .. కుటుంబాలను సీఎం యోగి ఆదిత్యనాథ్ పరామర్శిస్తున్న వేళ ఉపేంద్ర వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఆధారాలు ఉన్నాయా ?
మీడియా ప్రతినిధుల అరెస్ట్ గురించి ప్రస్తావించగా .. జర్నలిస్టులు గౌరవప్రద వృత్తిలో ఉన్నారని, వారు వార్తలపై దృష్టిసారించాలి తప్ప ..వ్యక్తుల గౌరవాన్ని కించపరిచేందుకు కాదని స్పష్టంచేశారు. ప్రతి ఒక్క మీడియా ప్రతినిధి తాము సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అంశాన్ని సునిశీతంగా పరిశీలించుకోవాలని సూచించారు. ప్రశాంత్ చేసిన మార్ఫింగ్ వీడియో గురించి మహిళ చర్చలో పాల్గొని కామెంట్లు చేశారు. దానికి సంబంధించి ఆమె వద్ద ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు ఉపేంద్ర.
ఇదీ నేపథ్యం
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు సంబంధించి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ప్రశాంత్. అందులో ఓ మహిళ తనను పెళ్లి చేసుకోవాలని యోగి ఆదిత్యనాథ్ను కోరుతుంది. యోగి ఆదిత్యనాథ్ బ్రహ్మచారి అనే విషయం తెలిసిందే. ఆ మహిళ వీడియో ముందు యోగి ఫోటో మార్పింగ్ చేసి .. ప్రశాంత్ పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. దీనిని తన ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల్లో పోస్టు చేశారు. దీంతో వీడియో వైరలవడంతో .. పోస్ట్ పెట్టిన ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలసిందే.
మరో ముగ్గురి అరెస్ట్ .
ప్రశాంత్ వీడియో పోస్టు చేశాక .. ఈ అంశంపై న్యూస్ చానెల్లో చర్చ కూడా జరిగింది. దీంతో డిబేట్ చేసిన చానెల్ యాజమాన్యంపై కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. టీవీ చానెల్ హెడ్ ఇషిక సింగ్, ఎడిటర్ అనూజ్ శుక్లాను ఇప్పటికే నోయిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ షేర్ చేసిన వీడియో ఇష్యూ .. జూన్ 6న జరిగిన టీవీ చర్చల్లో ప్రస్తావన వచ్చింది. ఓ మహిళ ప్రతినిధి వీడియో అంశాన్ని ప్రస్తావిస్తూ .. యోగి పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారు. ప్రశాంత్, ఇషిక, అనూజ్తో పాటు నాలుగో వ్యక్తిని గోరఖ్పూర్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.