చిన్నారిని చిదిమేసిన కామాంధుడు.. రాళ్లతో కొట్టి చంపాలన్న మెహబూబా..
బందిపోరా : జమ్మూకాశ్మీర్ బందిపోరా జిల్లాల్లో ఓ కామాంధుడు దారుణానికి పాల్పడ్డాడు. పక్కింట్లో ఉండే మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనతో బందిపోరాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజలు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఒకచోట స్టూడెంట్స్, భద్రతా బలగాల మధ్య ఘర్షణ తలెత్తింది. చిన్నారిపై అత్యాచార ఘటన తదనంతర పరిస్థితుల నేపథ్యంలో బందిపోరాలో కాలేజీలు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
చిన్నారిపై అత్యాచారం జరిగిన మాట వాస్తవమేనని పోలీసులు ప్రకటించారు. నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. కేసు దర్యాప్తును సిట్కు అప్పగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. నిరసనలు మరింత పెరగకుండా ఇంటర్నెట్ స్పీడును తగ్గించారు. అయితే కేసు విచారణ శరవేగంగా పూర్తి చేసి నిందితున్ని కఠినంగా శిక్షించాలని ప్రజలు, రాజకీయపార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
బందిపొరా జిల్లాలో చిన్నారి బాలికపై లైంగిక దాడి ఘటనను పలువురు నాయకులు తీవ్రంగా ఖండించారు. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కామాంధుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఐజీకి సూచించారు. చిన్నారిపై అత్యాచారం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. లైంగిక దాడికి పాల్పడిన కామాంధున్ని షరియా చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కోరారు. సంబల్లో జరిగిన దారుణ ఘటన గురించి వినడానికే తనకు సిగ్గుగా ఉందని ట్వీట్ చేశారు. లైంగిక దాడి ఘటనలపై కొందరు మహిళలే నిందితులను ప్రేరేపించేలా వ్యవహరిస్తారని సమాజం నిందిస్తుందని, మరి ఆ చిన్నారి చేసిన నేరం ఏంటని మెహబూబా ప్రశ్నించారు.