యూపీలో ఉన్నావ్ సీన్ రిపీట్... అత్యాచార బాధితురాలిపై పెట్రోల్ దాడి... ఆస్పత్రిలో మృతి...
ఉత్తరప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న నేరాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలతో ఆ రాష్ట్రం నిత్యం క్రైమ్ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. తాజాగా బులంద్షహర్లో ఓ అత్యాచార బాధితురాలిపై నిందితుడి బంధువు ఒకరు దాడి చేశారు. ఆమెకు నిప్పంటించి సజీవదహనం చేసేందుకు యత్నించాడు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితురాలు... చికిత్స పొందుతూ మంగళవారం(నవంబర్ 17) మృతి చెందింది. అత్యాచార కేసులో రాజీ కుదుర్చుకునేందుకు తిరస్కరించడంతో బాధితురాలిపై దాడి జరగడం గమనార్హం. గతేడాది ఉన్నావ్ అత్యాచార కేసులోనూ బాధితురాలిపై నిందితులు పెట్రోల్ దాడి చేసిన సంగతి తెలిసిందే.
కుటుంబ సభ్యులు ఏమంటున్నారు...
అత్యాచార కేసులో రాజీ కుదుర్చుకోవాలని గత కొన్నాళ్లుగా నిందితుడి కుటుంబ సభ్యులు,స్నేహితులు తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితురాలి కుటుంబం వెల్లడించింది. అందుకు ఒప్పుకోకపోవడంతో నిందితుడి తండ్రి తమ కుమార్తెపై దాడికి పాల్పడినట్లు తెలిపింది. బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో కాలిన గాయాలతో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.
ముగ్గురి అరెస్ట్..
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా ఏడుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు ఇప్పటికే జైల్లో ఉన్నాడని సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ కేసు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసులపై వేటు కూడా వేసినట్లు చెప్పారు. అంతకుముందు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి భిన్నమైన వాదన వినిపించారు. ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర మనస్తాపంతో బాధితురాలే తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు.
అగస్టులో కేసు నమోదు...
ఈ ఏడాది అగస్టు 15న అత్యాచార ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని ప్రకారం.. తమ గ్రామంలోని మామిడి తోటకు కాపలాగా ఉండే ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు చేసిన రోజే పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అప్పటినుంచి కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా నిందితుడి మామ బాధితురాలిని,ఆమె కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేస్తున్నాడు. మరోవైపు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధితురాలిని మరింత ఆవేదనకు గురిచేసింది. ఇదే క్రమంలో నిందితుడి మామ ఆమెపై దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు.
Recommended Video
ఉన్నావ్ ఘటన తరహాలో...
గతేడాది యూపీలోని ఉన్నావ్ అత్యాచార కేసులోనూ బాధితురాలిపై పెట్రోల్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. కోర్టు విచారణకు వెళ్తున్న సమయంలో బాధితురాలిని నిందితులు చుట్టుముట్టి, నిప్పు అంటించారు. దీంతో 90శాతం కాలిన గాయాలతో ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి చెందింది. ఇటీవల హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటన కూడా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. బాధితురాలిపై నిందితులు తీవ్రంగా దాడి చేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.