యూపీలో దారుణం: కోర్టుకు వెళుతుండగా అత్యాచార బాధితురాలికి నిప్పు పెట్టిన దుండగులు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో దారుణం చోటుచేసుకుంది. ఉన్నావ్ జిల్లాలో అత్యాచార బాధితురాలిపై దుండగులు నిప్పు అంటించారు. బాధితురాలని లక్నో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఏడాది మార్చిలో ఆమెపై అత్యాచారం జరిగింది. అయితే ప్రాణాలతో బయటపడ్డ ఆ మహిళ తన గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గురువారం ఉదయం కేసు కోర్టులో విచారణకు రాగా ఆమె కోర్టుకని బయలు దేరిన సమయంలో ఆమెపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నిప్పు పెట్టారు.
ప్రస్తుతం మహిళ లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాదాపు 60 నుంచి 70శాతం గాయాలపాలైనట్లు డాక్టర్లు చెప్పారు. బాధితురాలికి నిప్పు పెట్టిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు ఆమెపై అత్యాచారం చేసినవాడు ఉన్నాడు. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహిళ కోర్టుకు వెళుతున్న సమయంలో ఆమెకు ముగ్గురు వ్యక్తులు నిప్పంటించారని సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక తనపై దాడి చేసిన వారి పేర్లను బాధితురాలు చెప్పిందని పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పిన పోలీసులు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు .
మార్చిలో మహిళపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమెపై అత్యాచారం చేయడమే కాదు దాన్ని వీడియో కూడా తీశారని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ముందుగా ఫిర్యాదు స్వీకరించని పోలీసులు రాయబరేలీ స్థానిక కోర్టు ఆదేశాల మేరకు ఫిర్యాదును స్వీకరించారు. ఇందులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే బెయిల్ కూడా లభించింది. మరో నిందితుడిని ఇప్పటి వరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. అయితే అతని ఆస్తులను అటాచ్ చేసి లుక్కౌట్ నోటీసులను జారీ చేసినట్లు చెప్పారు.
బాధితురాలి ప్రాణాలు కాపాడటమే తమ ముందున్న తక్షణ కర్తవ్యం అని చెప్పారు యూపీ డీజీపీ ఓపీ సింగ్. ఎవరి పైనా తాను నింద మోపదలుచుకోలేదని ఆయన చెప్పారు. అయితే ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే సేకరిస్తామని చెప్పిన డీజీపీ ఆ సమయంలో నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు పోలీసులు ఒప్పుకుని ఉండరని భావిస్తున్నట్లు చెప్పారు.