సినిమాలపై మోజుతో వలలో చిక్కి.. ప్రధాని ఇలాకాలో రేప్ బాధితురాలి ఆక్రందన..
ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో రేప్ బాధితురాలైన మైనర్ బాలిక, కుటుంతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించడం సంచలనంగా మారింది. తమ ఫిర్యాదును పోలీసులు సరిగా పట్టించుకోలేదని ఆరోపిస్తూ సోమవారం వారణాసి ఎస్పీ ఆఫీసులు ముందు ఆ కుటుంబం విషంతాగింది. బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల్ని స్థానికులే హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం ఘాటుగా స్పందించారు.
ఉన్నావ్ లో రేప్ బాధితురాలిపై నిందితులే దాడి
ఇటీవలే యూపీలోని ఉన్నావ్ లో రేప్ బాధితురాలిపై నిందితులే దాడిచేసి చంపేసిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అంతలోనే వారణాసి ఉదంతం బయటికి రావడంతో యోగి సర్కారుపై విమర్శలు పెరిగాయి. ఈ వార్త తాలూకు ఆధారాల్ని అటాచ్ చేస్తూ.. ‘‘ఇదీ.. యూపీలో పరిస్థితి. వందలకొద్దీ ఘోరాలు జరుగుతున్నా ఇక్కడి ప్రభుత్వం మహిళల భద్రత పట్టించుకోవట్లేదు. సీఎం యోగి, ఆయన మంత్రులు సిగ్గుపడాల్సిన విషయమింది. ఆడబిడ్డల్ని కాపాడకుండా మీరు ఏం చేస్తున్నట్లు? ఎందుకున్నట్లు?''అంటూ ప్రియాంక ఫైరయ్యారు.
అదేంలేదు.. మేం గట్టిగానే ట్రై చేస్తున్నాం..
రేప్ బాధితురాలి ఆత్మహత్యాయత్నం ఘటనపై వారణాసి ఎస్పీ ప్రభాకర్ చౌదరి భిన్నంగా స్పందించారు. అక్టోబర్ 20న ఫిర్యాదు అందినరోజే బలమైన చట్టాల కింద కేసు నమోదుచేశామని, రెండు నెలల్లోపే ప్రధాన నిందితుడితోపాటు మరో వ్యక్తినీ అరెస్టు చేస పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
సినిమా నటి కావాలన్న కోరికతో..
కాగా, రేప్ బాధితురాలైన మైనర్ బాలిక.. సినిమాలపై ఉన్న మోజు వల్లే కీచకుల చేతికిచిక్కినట్లు పోలీసులు చెప్పారు. రైలు ప్రయాణంలో ఆమెకు జమీర్ అనే యువకుడు తారాసపడ్డాడని, జమీర్ తనను తాను రైల్వే టీసీగా చెప్పుకున్నాడని, ముంబైలో సినిమావాళ్లతో పరిచయాలున్నాయని ఆమెను నమ్మించాడు. నటి కావాలన్న కోరికతో ఆమె ఇంట్లోనుంచి పారిపోయి వచ్చేసింది. జమీర్ వెంటతీసుకొచ్చిన మరో ఐదుగురు అమ్మాయిలతో ముంబైకి చేరుకుంది. అక్కడ ఓ రూమ్ లో.. భోజనంలో మత్తుమందుకలిపి ఆమెపై జమీర్, అతని స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డారు. మెలకువ వచ్చిన తర్వాత విషయం అర్థం చేసుకున్న బాధితురాలు.. అక్కణ్నుంచి తప్పించుకుని ఇంటికొచ్చేసింది. మూడు నెలలుగా ఈ కేసు దర్యాప్తు దశను దాటలేదు.