బీఫ్ తిన్నారని ఇద్దరు మహిళలపై రేప్: అత్తామామల హత్య
మేవాట్: హర్యానాలో అతి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. బీఫ్ తిన్నారనే ఆరోపణపై ఇద్దరు యువతులపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డగించిన వారి అత్తామామలను కొట్టి చంపారు. గొడ్డు మాంసం తిన్నందుకు వారు ఈ శిక్ష విధించినట్లు సిగ్గు లేకుండా చెప్పుకున్నారు.
ఈ ఘోరమైన సంఘటన హర్యానాలోని మేవాట్లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ మేరకు 20 ఏళ్ల మహిళ, ఆమె కజిన్ 14 ఏళ్ల బాలిక ఢిల్లీలో సామాజిక కార్యకర్త షబ్నం హష్మీ సమక్షంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 24న తమ ఇంట్లోకి ప్రవేశించి తమపై అఘాయిత్యానికి పాల్పడ్డారని, బీఫ్ తిన్నందుకే మీకు ఈ శిక్ష విధించామని దుండగులు తమతో అన్నట్లు బాధితురాలు చెప్పింది.
అడ్డుకున్న తమ అత్తామామలను కట్టేసి కొట్టడంతో వారు చనిపోయారని తెలిపింది. అయితే ఈ ఘటనపై బాధిత మహిళలుగానీ, వారి కుటుంబీకులుగానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తాము గొడ్డు మాంసం తినలేదని చెప్పినా వినలేదని, తిన్నామని చెప్పాలని ఒత్తిడి చేశారని బాధితురాలు చెప్పింది.
ఈ సంఘటనపై దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. నలుగురిపై పోలీసులు అత్యాచారం కింద, అక్రమ చొరబాటు కింద కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేశారు. అయితే, గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో హత్యానేరం కింద కూడా కేసు నమోదు చేశారు.