పోలవరంపై బీజేపీకి రాపోలు, జైరాంకి నో, విభజనపై ఎంపీ
అంతకుముందు జైరామ్ రమేష్ పోలవరం ప్రాజెక్టుకు అనుకూలంగా మాట్లాడారు. దీనిపై రాపోలు స్పందించారు. తమ పార్టీకి చెందిన జైరాం రమేష్ పోలవరం ప్రాజెక్టుకు మద్దతుగా మాట్లాడారని, ఆయనతో తాను ఏకీభవించడం లేదన్నారు. ఈ చర్చ కాంగ్రెసు పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యానికి అద్దం పడుతోందన్నారు. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా, చత్తీస్గడ్లోని దంతెవాడ జిల్లా, తెలంగాణ రాష్ట్రం ఎందుకు రోదిస్తుందో గుర్తించాలన్నారు.
పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ముంపునకు గురవుతుందని రాపోలు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు లక్షల మంది పోలవరం ముంపు బాధితుల బాధను హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అర్థం చేసుకోవాలని కోరారు. ముంపు ప్రాంతాల్లోని గిరిజనులు తీవ్ర ఆందోళనతో ఉన్నారన్నారు. నాటి నుండి నేటి వరకు పలువురు ఇరిగేషన్ నిపుణులు పోలవరం ప్రాజెక్టు వద్దని సూచించారన్నారు. రాజమండ్రికి చెందిన హనుమంత రావు కూడా వ్యతిరేకించారన్నారు.
ముంపు ప్రాంతాల్లో ఉన్న 2.50 లక్షల గిరిజనులు, 1.50 లక్షల ఇతరులను బాధలను అర్థం చేసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల నాలుగు లక్షల కుటుంబాలు మునుగుతున్నాయన్నారు. బీజేపీ నేతలు నిత్యం స్మరించే రాముడే పోలవరం ప్రాజెక్టు వల్ల మునిగిపోతున్నాడన్నారు. దీని వల్ల గిరిజనుల జాతులు అంతరించే ప్రమాదముందన్నారు. తెలంగాణ ఇంకా బాలారిష్టాలు కూడా దాటలేదన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాకు వ్యతిరేకం కాదు: కేసీ త్యాగీ
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని కేసీ త్యాగి అన్నారు. ఎన్డీసీ సమావేశానికి పిలిచి ఇతర రాష్ట్రాల డిమాండ్ల పైన చర్చించాలన్నారు. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు. విభజన నేపథ్యంలో రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు.
రాజకీయ లబ్ధి కోసం విభజన: నరేష్ అగర్వాల్
రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రప్రదేశ్ను విభజించారని ఎస్పీ ఎంపీ నరేష్ అగర్వాల్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నాలుగు రాష్ట్రాల సమస్య అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను ఈ ప్రభుత్వం అమలు చేయవద్దని కోరారు.
రాజ్యాంగ విరుద్దం: రాజీవ్
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్దమని సీపీఎం ఎంపీ రాజీవ్ అన్నారు. ఈ బిల్లు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.