అసోం తేయాకు మరో రికార్డు.. కిలో రూ.70,501 పలికిన మైజన్ టీ
తేయాకు ఉత్పత్తిలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అసోం రోజుకో రికార్డు సృష్టిస్తోంది. ఇక్కడ పండించిన తేయాకు ధర కిలో వేలల్లో పలుకుతోంది. గౌహతి టీ ఆక్షన్ సెంటర్లో రెండు రోజుల నిర్వహించిన వేలం పాటలో కిలో రూ.50వేలు పలికిన మనోహరి టీ రికార్డు సృష్టించగా.. తాజాగా ఆ రికార్డు బద్ధలైంది. అత్యంత అరుదైన మరో తేయాకు కిలో రూ.70, 501 పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మైజన్ టీ ఎస్టేట్లో పండించిన తేయాకు మనోహరీ గోల్డ్ రికార్డు బ్రేక్ చేసింది. దర్బంగా జిల్లాలోని ప్రపంచంలోనే ప్రాచీనమైన టీ కంపెనీ అసోం కంపెనీ లిమిటెడ్కు చెందిన మైజన్ గార్డెన్లో ఈ తేయాకును పండించారు. వందేళ్ల క్రితం నాటిన మొక్కల నుంచి ఈ టీ ఆకులను సేకరిస్తారు. ఈ తేయాకుతో తయారు చేసే టీ అద్భుతమైన రుచితో పాటు అమోఘమైన వాసన కలిగి ఉండి టీ ప్రియులను ఆకట్టుకుంటుంది.
గౌహతికి చెందిన ముద్రా టీ కంపెనీ ఈ తేయాకు కొనుగోలు చేసింది. ఆన్లైన్ టీ స్టోర్తో పాటు బెల్జియంకు చెందిన క్లైంట్కు దీన్ని పంపనుంది. అసోం టీ ధరలు ఇంతగా పెరుగుతుండటం తేయాకు పరిశ్రమకు శుభపరిణామమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. స్పెషాలిటీ టీ కొనుగోళ్లు పెరుగుతుండటంతో ఎస్టేట్ ఓనర్లు వాటివైపు దృష్టి సారిస్తున్నారు. గతేడాది భారత్లో 1325మిలియన్ కిలోల తేయాకు ఉత్పత్తి కాగా.. అందులో సగం 630మిలియన్ కిలోలు అసోంలోనే ఉత్పత్తైంది. అందులో 256 మిలియన్ కిలోలు విదేశాలకు ఎగుమయ్యాయి.