సీఎం అనూహ్య ఎత్తుగడ.. భార్యకు కీలక పోస్టు.. అంతా పథకం ప్రకారమే..
మరాఠాల హక్కుల కోసమే పుట్టుకొచ్చిన శివసేన పార్టీ.. కాలక్రమంలో తన పరిధుల్ని విస్తరించుకుంటున్నది. ఒకప్పుడు కరడుగట్టిన ప్రాంతీయవాదాన్ని వినిపించిన ఠాక్రే కుటుంబం.. ఇవాళ వసలదారులందరితో మమేకమైపోయింది. మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కట్టర్ హిందూత్వ నుంచి సాఫ్ట్ హిందూత్వకు మళ్లింది. సొంత పత్రిక సామ్నా ద్వారా బీజేపీ, ప్రధాని మోదీపై అదే పనిగా విమర్శల దాడి చేస్తూనే ఉంది. రాతలతో ప్రత్యర్థుల్ని దెబ్బతీసే పనిని ఇకపై రష్మీ ఠాక్రే నిర్వహించనున్నారు.
శివసేన పార్టీ ఆధ్వర్యంలో 'సామ్నా'అనే దినపత్రిక, 'దోపహర్ కా సామ్నా'అనే మరో పత్రిక నడుస్తున్నాయి. రెగ్యులర్ వార్తలతో పాటు పలు అంశాల్లో పార్టీ స్టాండ్ ను వెల్లడించడానికి 'సామ్నా'ను ఆయుధంగా వాడుకుంటున్నారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే 1983లో సామ్నాను ప్రారంభించారు. ఆయన చనిపోయిన తర్వాత కొడుకు ఉధ్దవ్ ఠాక్రే పత్రికకు ఎడిటర్ అయ్యారు. అనూహ్య రీతిలో ఉద్ధవ్ గతేడాది మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఎడిటర్ పదవికి రాజీనామాచేశారు.
కొతకాలంగా ఖాళీగా ఉన్న సామ్నా ఎడిటర్ పోస్టులో సీఎం ఉద్దవ్ భార్య రష్మీ ఠాక్రే నియమితులయ్యారు. ఆదివారమే ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈమేరకు పబ్లిషర్ రాజేంద్ర భగవత్ ఒక ప్రకటన చేశారు. పైకి కనిపించనప్పటికీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో రష్మీ చాలా చురుకుగా వ్యవహరిస్తారని శివసైనికులు చెబుతారు.
కొడుకు ఆదిత్య ఠాక్రేకు సీఎం పోస్టు ఇస్తేనే బీజేపీకి శివసేన మద్దతు ఇవ్వాలన్న డిమాండ్ గానీ, బీజేపీతో శివసేన విడిపోయిన తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్ లతో పొత్తుపెట్టుకునే విషయంలోగానీ ఉద్ధవ్.. భార్య రష్మీ మాటకు ప్రాధాన్యం ఇచ్చారని అప్పట్లో వార్తలొచ్చాయి. కామర్స్ లో డిగ్రీ చేసి, ఎల్ఐసీలో పనిచేస్తున్న సమయంలో రష్మీకి ఉధ్దవ్ తో పరిచయం ఏర్పడటం, తర్వాత అది ప్రేమ పెళ్లికి దారితీయడం తెలిసిందే. అటు కూటమి ధర్మం, ఇటు బీజేపీతో సమాన దూరం పాంటించాల్సిన తరుణంలో శివసేన ఆలోచనల్ని రష్మీ కరెక్టుగా ప్రజెంట్ చేయగలదన్న నమ్మకంతోనే ఉద్ధవ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.