మోడీ ప్రమాణ స్వీకారం: ముస్తాబైన రాష్ట్రపతి భవన్..అతిథులకు వడ్డిస్తున్న వంటకాలు ఇవే..!
ఢిల్లీ: గురువారం జరగనున్న మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాష్ట్రపతి భవన్ సిద్ధమవుతోంది. 6వేల మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు. ఇక రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధాని మోడీ కార్యక్రమాన్ని చాలా సింపుల్గా నిర్వహించాలని చెప్పడంతో అధికారులు వారి ఆదేశాలను పాటిస్తున్నారు.
ఇక ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్లోని ముందర కోర్టులో జరుగుతుంది. అంటే విదేశాల నుంచి ఎవరైనా అధినేతలు వస్తే వారికి అక్కడే గౌరవవందనం స్వీకరిస్తారు. దర్బార్హాలులో కాకుండా ఇలా ముందర కోర్టులో ఒక ప్రధాని అభ్యర్థి ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగోసారి కావడం విశేషం.
దర్బార్ హాలులో అయితే 500 మందికి సరపడ స్థలం మాత్రమే ఉంటుంది. 1990లో తొలిసారిగా ముందర కోర్టులో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు చంద్రశేఖర్.1998లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 2014లో ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేయగా తిరిగి 2019లో ఆయనే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలను అనుమతిస్తున్నారు. ఇక 14 దేశాల నుంచి అధ్యక్షులు, దౌత్యాధికారులు కార్యక్రమాన్ని తిలకించనున్నారు. వీరితో పాటు ఇతర రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు, పారిశ్రామికవేత్తలు కూడా హాజరుకానున్నారు. 2014లో ఎలాగైతే నిర్వహించారో ఈ సారి కూడా అదే క్రమంలో నిర్వహించేందుకు అధికారులు ప్లాన్ చేశారు. ఇక మోడీ ప్రమాణం చేయడం అందరికి కనిపించేలా సీటింగ్ను ప్లాన్ చేశారు అధికారులు.
వచ్చిన విదేశీ అతిథులకు ఏడుగంటల తర్వాత విందు ఏర్పాటు చేసింది రాష్ట్రపతి భవన్. అంతకుముందు టీ ఇవ్వనున్నారు. ఇక సమోసా నుంచి రాజ్భోగ్ వరకు అతిథులకు భారత వంటకాలు రుచి చూపించనున్నారు.ఇక విందులో మాంసాహారం, శాఖాహారం సప్లై చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి భవన్లో వంటలు చేయడం ప్రారంభం అయ్యాయి. ఇక పెద్ద సంఖ్యలో నీళ్ల బాటిళ్లను కూడా రాష్ట్రపతి భవన్ ఏర్పాటు చేయనుంది.