ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగింది: ఆర్ఎస్ఎస్ చీఫ్
నాగ్ పూర్: ప్రపంచ దేశాలలో భారత్ ప్రతిష్ట పెరిగిందని, దేశ ప్రజలు గర్వంగా తల ఎత్తుకుని తిరుగుతున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గురువారం నాగ్ పూర్ లో విజయదశమి ఉత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రెండేళ్ల క్రితం దేశంలో నిరాశకరమైన వాతావరణం ఉండేదని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఆశావాద దృక్పధం కనిపిస్తోందని అన్నారు. ఇదే సందర్బంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపించారు.
ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రపంచ దేశాల దృష్టి భారతదేశంపై పడిందని మోహన్ భగవత్ చెప్పారు. గత ప్రభుత్వాలు భారత్ ను అభివృద్ది చెయ్యడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని పరోక్షంగా మండిపడ్డారు.
గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దేశ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నదని, అన్ని రంగాలను అభివృద్ది చెయ్యడానికి శక్తి వంచన లేకుండా పని చేస్తున్నదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్, డీఆర్ డీఓ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ షరావత్ తదితరులు పాల్గోన్నారు.