రాఫెల్ వివాదంలో పాకిస్థాన్ సర్టిఫికెట్ కావాల్నా?.. రాహుల్పై కేంద్ర మంత్రి రవిశంకర్ ఫైర్
ఢిల్లీ : జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఘాటుగా స్పందించారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. రాఫెల్ విషయంలో రాహుల్ గాంధీ కఠోర అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎయిర్ ఫోర్స్ చెప్పేది వినరు, సుప్రీంకోర్టు తీర్పు నమ్మరు.. యుద్ద విమానాలపై పాకిస్థాన్ నుంచి ఆయనకు సర్టిఫికెట్ కావాలా అంటూ ప్రశ్నించారు. రాఫెల్ వివాదంలో ప్రధాని మోడీకి క్లీన్ చిట్ వచ్చినా.. రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పించడం సరికాదని మండిపడ్డారు.
మా డాటా చోరీ చేసి మాకే ఫోన్లా?.. వాళ్ల ప్లాన్ తిప్పికొట్టాలన్న చంద్రబాబు
రాఫెల్.. రాహుల్ మంత్ర
ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ గా.. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రోజుకోసారి తెరపైకి వస్తున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీని ఇరుకున పెట్టే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. అందులోభాగంగా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో ఆయనకు దీటుగా సమాధానం చెబుతూనే ఉన్నారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. తాజాగా రాహుల్ గాంధీపై మరోసారి ఎదురుదాడికి దిగారు.
రాజకీయ లబ్ధి కోసమేనా?
రాఫెల్ కొనుగోళ్లకు సంబంధించిన అంశాన్ని రాహుల్ గాంధీ అస్త్రంగా వాడుకుని లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు రవిశంకర్ ప్రసాద్. రాఫెల్ విషయంలో ఆయన ఎయిర్ ఫోర్స్ ను నమ్మడం లేదు, సుప్రీంకోర్టు తీర్పును గౌరవించడం లేదు.. మరి పాకిస్థాన్ ను మాత్రమే నమ్మేటట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ కఠోర అబద్ధాలను పూర్తిగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
రాఫెల్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కాగ్ స్పష్టం చేసినా.. రాహుల్ గాంధీ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. రాఫెల్ కొనుగోళ్లలో ఎలాంటి వాణిజ్యపరమైన అంశాలు లేవని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. పదే పదే అదే విషయం ప్రస్తావించడం ఆయన అవివేకానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఎయిర్ ఫోర్స్ చెప్పేది వినరు, సుప్రీంకోర్టు తీర్పు నమ్మరు, కాగ్ నివేదిక పట్టించుకోరు.. క్లీన్ చిట్ కోసం ఆయనకు పాకిస్థాన్ ఇచ్చే సర్టిఫికెట్ కావాల్నా అంటూ ప్రశ్నించారు. అది కావాలంటే మేము హెల్ప్ లెస్ అంటూ వ్యాఖ్యానించారు.
రాహుల్ వర్సెస్ మోడీ వయా రవిశంకర్
రాఫెల్ డీల్ కు సంబంధించి కీలకపత్రాలు చోరీకి గురయ్యాయని చెబుతున్నప్పుడు.. కచ్చితంగా ప్రధాని మోడీ నిందితుడు అవుతారని రాహుల్ గాంధీ వాదిస్తున్నారు. ఆ కోణంలో ఆయనను ఎందుకు విచారించలేకపోతున్నారని ప్రశ్నించారు. 30 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి కారకుడైన వారిని అలాగే వదిలేస్తారా అంటూ మండిపడ్డారు. రాఫెల్ డీల్ లో మోడీని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అందులో భాగంగా కొన్ని సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఫైరయ్యారు. వాటికి దీటుగా సమాంతర వ్యవస్థలను నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీకి మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు రవిశంకర్ ప్రసాద్.