మోదీపై దాడికి ఫేస్ బుక్ ఊతం - కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలనం - జూకర్బర్గ్కు ఘాటు లేఖ
ఇండియాలో ఫేస్ బుక్ కార్యకలాపాలకు సంబంధించి ఆరోపణల వెల్లువ కొనసాగుతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, రైట్ వింగ్ ఐడియాలజిస్టులపై వ్యూహాత్మక దాడి జరుగుతున్నదని, అందుకు ఫేస్ బుక్ ఇండియా ఉద్యోగులు సైతం సహకరిస్తున్నారని సాక్ష్యాత్తూ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.
Recommended Video
ముఖ్యమంత్రి సంతకం ఫోర్జరీ - రిలీఫ్ ఫండ్ నుంచి లక్షలు స్వాహా - బ్యాంకు అనూహ్య నిర్ణయం
అదే పనిగా ప్రధానిపై, కేంద్ర మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తోన్నవారి పట్ల ఫేస్ బుక్ పక్షపాత దోరణిని ప్రదర్శిస్తున్నదని, సంస్థ నిష్క్రియాత్మకతపై తిరుగులేని ఆధారాలు కూడా ఉన్నాయని మంత్రి రవిశంకర్ పేర్కొన్నారు. ఇండియాలో ఫేస్ బుక్ కార్యకలాపాలను ప్రశ్నిస్తూ ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్డ్ కు కేంద్ర మంత్రి మంగళవారం ఘాటు లేఖ రాశారు. ఫేస్బుక్-బీజేపీ ఉదంతంపై దుమారం కొనసాగుతున్న సమయంలోనే కేంద్ర మంత్రి లేఖ రాయడం చర్చనీయాంశమైంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఫేస్బుక్ ఉద్యోగులు అనుచిత వ్యాఖ్యలు చేశారని రవిశంకర్ ప్రసాద్ తన లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికల్లో ఫేస్బుక్ ఉద్యోగులు ప్రధానిపై విమర్శలు చేస్తున్నారని, రైట్ వింగ్ ఐడియాలజీపైనా ఉద్దేశపూర్వక దాడి జరుగుతున్నట్లుగా ఉందని, దీనిపై వివరణ ఇవ్వాలని జూకర్బర్గ్ను ఆయన కోరారు. ఫేస్బుక్లో కీలక పదవుల్లో పని చేస్తున్న వారు సైతం ఈ జాబితాలో ఉన్నారని మంత్రి చెప్పుకొచ్చారు.
సోషల్ మీడియాలో మోదీ నిప్పురాజేశాం - అంకిదాస్ సంచలన కామెంట్స్ - ఫేస్ బుక్- బీజేపీ ఉదంతంలో ట్విస్ట్
ఫేస్ బుక్ - బీజేపీ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ.. మార్క్ జుకర్ బర్గ్ కు రెండు సార్లు లేఖలు రాసింది. ఫేస్ బుక్ ఇండియా విభాగం.. అధికార బీజేపీకి కొమ్ము కాస్తోందంటూ అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని, ఓ విదేశీ సంస్థ దేశంలో సామాజిక సమగ్రతకు భంగం కలిగించడాన్ని సహించలేమని, దీనిపై చట్టపరమైన, న్యాయపరమైన చర్యల దిశగా ఆలోచిస్తున్నామని సదరు లేఖలో కాంగ్రెస్ మండిపడింది.
కాగా , ఇండియాలో ఫేస్ బుక్ ను కాంగ్రెస్ పార్టీనే కంట్రోల్ చేస్తోందటూ గతంలో విమర్శలు చేసిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్... మంగళవారం నాటి లేఖలోనూ కీలక అంశాలను ప్రస్తావించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఫేస్బుక్ అకౌంట్లను తొలగించడానికి అధికార పార్టీ ప్రయత్నాలు చేసిందంటూ వస్తోన్న ఆరోపణలు అవాస్తవమని, ఫేస్బుక్ ఇండియాకు తాము ఎలాంటి ప్రతిపాదనలూ చేయలేదని జుకర్ బర్డ్ కు రాసిన లేఖలో మంత్రి స్పష్టం చేశారు. తన ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.