భారత్ గెలుపు: ఘనత రవిశాస్త్రిదా, ధోనీతో ప్యాచప్?
కార్డిఫ్: భారత్ ఇంగ్లాండుపై రెండో వన్డేలో సాధించిన విజయం ఘనత డైరెక్టర్ రవిశాస్త్రికి దక్కుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ మ్యాచులో చెలరేగి సెంచరీ సాధించిన సురేష్ రైనా రవిశాస్త్రి విశ్వాసం నింపడం వల్లే విజయం సాధ్యమైందని అంటున్నాడు. ఇంగ్లాండుపై టెస్టు సిరీస్లో టీమిండియా ఘోరంగా విఫలమైన తర్వాత బిసిసిఐ రవిశాస్త్రిని డైరెక్టర్గా నియమించింది. హెడ్ కోచ్ డంకెన్ ఫ్లెచర్ ఉండగా రవిశాస్త్రిని అలా నియమంచడం కూడా చర్చనీయాంశంగా మారింది.
రవిశాస్త్రి జట్టు సమావేశానికి వచ్చి కొన్ని మాటలు చెప్పారని, అది స్ఫూర్తినిచ్చిందని, మైదానానికి వెళ్తండగా తన పక్కన కూర్చున్నారని, పట్టుబట్టి ఆడాలని తనతో చెప్పారని సురేష్ రైనా చెప్పాడు. శాస్త్రి, ఫ్లెచర్, కెప్టెన్ ధోనీ ఎవరు ఇంచార్జీ అనేది మాత్రం తేలడం లేదు. వాతావరణం చాలా బాగుందని, రవిశాస్త్రి నియామకం ఫలితం ఇచ్చిందనేది రుజవైందని రైనా అన్నాడు.
ధోనీ వివాదాన్ని సామరస్యవూర్వకంగానే పరిష్కరించుకోవాలని బిసిసిఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2015 ప్రపంచ కప్ పోటీల వరకు డంకెన్ ఫ్లెచర్ బాస్గా ఉంటాడని ధోనీ చేసిన వ్యాఖ్య వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. ధోనీ వ్యాఖ్యలపై బిసిసిఐ కాస్తా వెనక్కి తగ్గి ప్యాచప్ చేసుకునే మార్గాన్ని ఎంచుకున్నట్లు అర్థమవుతోంది.
ధోనీ వాస్తవాలు మాట్లాడాడని, బిసిసిఐతో ఫ్లెచర్ కాంట్రాక్టు 2015 ప్రపంచ కప్ ముగిసే వరకు ఉందని బిసిసిఐ కార్యదర్శఇ సంజయ్ పటేల్ ఓ ప్రముఖ మీడియా సంస్థతో అన్నారు. ధోనీ వ్యాఖ్యలపై బోర్డు సమావేశంలో చర్చించబోమని చెప్పారు. పటేల్ ప్రతిస్పందనకు బిసిసిఐ ఇంటరీమ్ చీఫ్ శివలాల్ యాదవ్ మద్దతు తెలిపారు. రెండో వన్డేలో సాధించిన విజయం ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ వల్ల అయిన గాయాన్ని కాస్తా నయం చేసినట్లే ఉంది. ఇంగ్లాండు పర్యటన తర్వాత రవిశాస్త్రి ఓ నివేదిక సమర్పిస్తారని పటేల్ చెప్పారు.