టీమిండియా ఆల్ రౌండర్ భార్య పొలిటికల్ ఎంట్రీ.. లోక్ సభ ఎన్నికల్లో టికెట్ దక్కడం ఖాయం
అహ్మదాబాద్: భారత క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న రవీంద్ర జడేజా భార్య రివాబా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. భారతీయ జనతాపార్టీలో చేరారు. ఆదివారం సాయంత్రం గుజరాత్ లోని జామ్ నగర్ లో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ సీనియర్ నేత, గుజరాత్ వ్యవసాయ శాఖ మంత్రి రాన్ఛో ఫాల్దూ, జామ్ నగర్ లోక్ సభ సభ్యురాలు పూనమ్ మేడమ్ ఆమెకు కాషాయ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
క్షత్రియ సమాజంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కర్ణి సేనకు గుజరాత్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఈ బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలల వ్యవధిలోనే రివాబా.. బీజేపీలో చేరారు. బాలీవుడ్ మూవీ పద్మావత్ విడుదలను నిరసిస్తూ కర్ణిసేన చేపట్టిన ప్రదర్శనల్లో రివాబా చురుగ్గా పాల్గొన్నారు కూడా. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆమెకు టికెట్ కేటాయించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్ కోట్ లేదా జామ్ నగర్ లోక్ సభ నియోజకవర్గాల్లో ఏదైనా ఓ స్థానం రివాబా బరిలో దిగవచ్చని తెలుస్తోంది.
సుమారు ఏడాదికాలంగా ఆమె రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు. క్రికెటర్ రవీంద్ర జడేజా సొంత నగరం జామ్ నగర్. రాజ్ కోట్ లో రవీంద్రజడేజాకు ఓ రెస్టారెంట్ ఉంది. రివాబా జడేజా రాజకీయాల్లో కొనసాగుతూనే ఆ రెస్టారెంట్ ను పర్యవేక్షిస్తున్నారు. తన భార్య రాజకీయాల్లో చేరడంపై రవీంద్ర జడేజా అభ్యంతరం వ్యక్తం చేయలేదని అంటున్నారు. దీనిపై ఆయన ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో తలపడుతున్న టీమిండియాలో సభ్యుడు కావడంతో ప్రస్తుతం జట్టు వెంటే ఉంటున్నాడు.