తాజ్, ప్రెసిడెంట్ బిల్డింగ్ కూల్చాలి: అజంఖాన్
లక్నో: సమాజ్వాది పార్టీ సీనియర్ నేత, యూపి మంత్రి అజమ్ ఖాన్ ఎప్పుడూ సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. శనివారం మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ ఫ్యూడలిజానికి చిహ్నమని ఆయన అన్నారు.
రాష్ట్రపతి భవన్తో పాటు పార్లమెంటు భవనం, తాజ్ మహల్లను ఆయన బానిసత్వానికి చిహ్నాలుగా అభివర్ణించారు. బానిసత్వానికి గుర్తులుగా ఉన్న ఆ మూడు భవనాలను కూల్చివేయాలని ఆయన శనివారం నాడు డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కు చెందిన రజా డిగ్రీ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ కోసం ఖర్చు చేస్తున్న ధనమంతా వృథానేనని అన్నారు.
దేశంలో బానిసత్వానికి చిహ్నాలు ఏమిటన్న విషయాన్ని పరిశీలిస్తే.. ఆ జాబితాలో తాజ్ మహల్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నిర్మించిన రాష్ట్రపతి భవన్, పార్లమెంటు భవనాలేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నెంబర్ వన్ ఫ్యూడలిజానికి తాజ్ మహల్ నిదర్శనమని మనమంతా కచ్చితంగా అంగీకరించాల్సిందేనని చెప్పారు. ఆ తర్వాత జాబితాలో రాష్ట్రపతి నిలయం, పార్లమెంటు భవన్ వస్తాయన్నారు. వాటిని పడగొట్టాలన్నారు.