నోట్ల రద్దు: విత్ డ్రా రూ.50 వేలకు పెంపు! రైతులకూ శుభవార్త
ఆర్బీఐ ఊరట కలిగించే ప్రకటన చేసింది. కరెంట్, ఓవర్, క్యాష్ క్రెడిట్ ఖాతాలు కలిగిన వారికి నగదు విత్ డ్రా పరిమితిని వారంలో రూ.50 వేలకు పెంచింది. వీరికి రూ.2 వేల నోట్లు ఇస్తారు.
ముంబై: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది నగదు మార్చుకుంటున్నప్పటికీ.. రద్దు ప్రకటన అప్పటి నుంచి రూ.4,500 నుంచి రూ.2,000 వరకే మార్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. అలాగే వారానికి కూడా పరిమితి విధించింది.
తాజాగా, కరెంట్, ఓవర్, క్యాష్ క్రెడిట్ ఖాతాలు కలిగిన వారికి నగదు విత్ డ్రా పరిమితిని వారంలో రూ.50 వేలకు పెంచింది. వీరికి రూ.2 వేల నోట్లు ఇస్తారు. కనీసం మూడు నెలల నుంచి ఈ ఖాతాలు నిర్వహిస్తున్న వారికే వారంలో రూ.50వేలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
వ్యక్తిగత ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలు కలిగిన వారికి ఇధి వర్తించదని తెలిపింది. రైతులకు కూడా ఊరట కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దుకాణాలలో రద్దు చేసిన పాత రూ.500, రూ.1000 నోట్లతో రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది.
గుర్తింపు కార్డు చూపించి రైతులు విత్తనాలు కొనుగోలు చేయవచ్చు. కేంద్ర, రాష్ట్ర విత్తన సంస్థలు, వ్యవసాయ యూనివర్సిటీలు, ఐసీఏఆర్ సంస్థల నుంచి విత్తనాలు కొనవచ్చు. వివాహాలకు రేపటి నుంచి రూ.2.5 లక్షల విత్ డ్రా సదుపాయం కల్పించినట్లు ఆర్బీఐ తెలిపింది.