ఆర్బీఐ దిమ్మతిరిగే షాక్: ఇక రూ.10వేలే లిమిట్!, ఏటీఎంల సంఖ్య భారీగా కుదింపు!
ఏటీఎంలలో నగదు లోడ్ చేయవద్దని ఆర్బీఐ నుంచి మార్గదర్శకాలు రావడంతో ఇక వాటి నిర్వహణ భారాన్ని వదిలించుకోవాలని బ్యాంకులు భావిస్తున్నాయి.
హైదరాబాద్: ఆర్బీఐ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు చూస్తుంటే దేశంలో జనాలను బలవంతంగా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ వైపు మళ్లిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. ఇప్పటికే సగానికి పైగా ఏటీఎంలలో డబ్బుల్లేక అల్లాడుతున్న జనాలకు ఆర్బీఐ మరో షాక్ ఇవ్వనుంది.
ఏటీఎం కేంద్రాల కుదింపుతో పాటు నగదు విత్ డ్రాపై మరోసారి ఆంక్షలు విధించాలని ఆర్బీఐ భావిస్తోంది. ఇదే గనుక జరిగితే సామాన్యుడి కరెన్సీ కష్టాలు ఇక ముందు కూడా కొనసాగడం ఖాయం. ఇప్పటికే బ్యాంకులు విధిస్తున్న సర్వీస్ చార్జీలు, పెనాల్టీల దెబ్బకు గగ్గోలు పెడుతున్న సామాన్యుడికి ఇదో మరో ఎదురుదెబ్బ.
కథ మొదటికొచ్చింది!: మళ్లీ 'నోట్ల రద్దు' నాటి పరిస్థితులు.. 'నో క్యాష్'
ఏటీఎం కేంద్రాలు తగ్గిపోతాయి:
దేశంలో సగానికి పైగా ఏటీఎంలు ప్రస్తుతం అవుటాఫ్ సర్వీస్ లేదా నో క్యాష్ బోర్డులతోనే దర్శనమిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏటీఎంల ఉపయోగాన్ని వీలైనంతగా తగ్గించేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు సాధ్యమైనంత మేర ఏటీఎం కేంద్రాలను మూసివేయడంతో పాటు, అవసరం లేని చోట్ల పూర్తిగా తొలగించేలా ఆర్బీఐ కసరత్తులు చేస్తోంది.
ఇప్పటికే ఆదేశాలు:
ఏటీఎం కేంద్రాలను తగ్గించాలన్న యోచనలో భాగంగా ఇప్పటికే బ్యాంకులకు ఆర్బీఐ నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీనిపై స్పష్టమైన ఆదేశాలు వచ్చేదాకా ఏటీఎంలలో డబ్బు నింపవద్దని, కొన్ని ఏటీఎంలలో మాత్రమే నగదు పెట్టాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి రెండో వారంలోనే ఆర్బీఐ నుంచి బ్యాంకులకు ఆదేశాలు వెలువడినట్లు తెలుస్తోంది.
పనిచేయని 90శాతం ఏటీఎంలు:
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటికే 90శాతం ఏటీఎంలు పనిచేయకపోవడం, మరికొన్ని రోజుల దాకా ఏటీఎంలలో డబ్బు పెట్టవద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ అవడంతో సామాన్యులకు కరెన్సీ కష్టాలు తప్పేలా లేదు.
ఆర్బీఐ లైసెన్స్ ఉండే ఏజెన్సీలు సైతం కొన్నిరోజులుగా ఏటీఎంలలో డబ్బు లోడ్ చేయడం లేదు. ఆర్బీఐ ఆదేశాలతో బ్యాంకులు ఇప్పట్లో ఏటీఎంలలో నగదు లోడ్ చేసే అవకాశం లేకపోవడంతో.. ఫలితంగా ఖాతాదారులు ప్రతీ చిన్న అవసరానికి బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది.
విత్ డ్రాపై ఆంక్షలుఫ
ప్రస్తుతం సేవింగ్స్ ఖాతాదారులు రూ.40వేల నుంచి రూ.1.50లక్షల వరకు నగదును ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసుకునేందుకు అవకాశముంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇది గరిష్టంగా రూ.1లక్ష వరకు ఉంది. అయితే రానున్న రోజుల్లో ఈ మొత్తాన్ని రూ.10వేలకు మాత్రమే కుదించాలని ఆర్బీఐ భావిస్తోంది.
ఈ నిబంధన గనుక అమలులోకి వస్తే ఖాతాదారులు తమ ఖాతాల్లోంచి రోజుకు రూ.10వేల కన్నా ఎక్కువ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోలేరు. ఈ మేరకు ఆదేశాలు వెలువడేదాకా ఏటీఎంలలో నగదు లోడ్ చేయవద్దని ఆదేశాలు ఆర్బీఐ నుంచి అందాయని ఎస్ బి ఐ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు.
బలవంతంగా డిజిటల్ వైపు:
ఆర్బీఐ చర్యల పట్ల సామాన్యుల నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఖాతాదారులను బలవంతంగా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ వైపు మళ్లించడానికి ఆర్బీఐ ప్రయత్నించడాన్ని వారు తప్పుపడుతున్నారు. కాగా, డిజిటల్ వైపు మళ్లించడానికే ఆర్బీఐ ఈ నిబంధనలను తీసుకొస్తోందని, ఏప్రిల్ రెండో వారంలో దీనిపై స్పష్టత వస్తుందని బ్యాంకర్లు చెబుతున్నారు.
ఏటీఎంలను కుదిస్తే ఖాతాదారులంతా బ్యాంకులకు క్యూ కడుతారని, ఇదే జరిగితే బ్యాంకుల్లో తాకిడి ఎక్కువై సిబ్బంది సంఖ్య పెంచుకోవాల్సి వస్తుందని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. రూ.10వేలు విత్ డ్రా పరిమితి విధిస్తే.. ఇక బ్యాంకుల ముందు క్యూ కట్టక తప్పదని, కౌంటర్లు పెంచాల్సిన పరిస్థితి వస్తుందని చెబుతున్నారు.
కష్టాలు మళ్లీ మొదలైనట్లే:
ఏటీఎంలలో నగదు లోడ్ చేయవద్దని ఆర్బీఐ నుంచి మార్గదర్శకాలు రావడంతో ఇక వాటి నిర్వహణ భారాన్ని వదిలించుకోవాలని బ్యాంకులు భావిస్తున్నాయి. నగదు లావాదేవీలు జరగనప్పుడు ఇక వాటిని నిర్వహించడం అనవసర ఖర్చు అన్న అభిప్రాయంలో ఉన్నాయి.
అద్దె చెల్లింపు, కరెంటు బిల్లు, ఏసీ వంటి నిర్వహణ భారం బ్యాంకులపై పడుతుండటంతో ఇక వాటిని మూసివేయడమే మేలు అనే అభిప్రాయంలో బ్యాంకర్లు ఉన్నారు. ఏప్రిల్ రెండో వారంలో ఆర్బీఐ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడగానే ఈ చర్యలు చేపడుతామని బ్యాంకర్లు చెబుతున్నారు.