కేంద్రానికి రూ. 1.76 లక్షల కోట్లు బదిలీ చేసిన ఆర్బీఐ..పుంజుకోనున్న ఆర్థిక వ్యవస్థ
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. కేంద్రప్రభుత్వానికి రూ. 1.76 లక్షల కోట్లు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇలా చేయడం ద్వారా మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అవకాశం ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్ రూపంలో రూ. 1,23,414 కోట్లు ఇవ్వగా ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ కింద రూ. 52వేల 637 కోట్లు బదిలీ చేసింది.
మాజీ ఆర్బీఐ గవర్నర్ బిమాల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ సూచనల మేరకు అధిక నగదు నిల్వ ఉండటంతో దాన్ని కేంద్రప్రభుత్వానికి బదిలీ చేయడం జరిగింది. ఇక ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని సభ్యులు ఇంత పెద్ద మొత్తంలో నగదు బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక అందరి ఏకాభిప్రాయం మేరకు ఆగష్టు 14న నివేదిక తయారు చేయడం జరిగింది. ప్రభుత్వం తరపున ప్రతినిధిగా ఆర్థికశాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ ఉన్నారు. ఆర్బీఐ నగదు బదిలీ చేయడంతో గత ఐదేళ్లుగా మందకొడిగా ఉన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు దోహదపడుతుంది.
గతవారం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ కొన్ని రాయితీలను ప్రకటించింది. అదే సమయంలో ద్రవ్యలోటు జీడీపీలో 3.3 శాతంకు పడిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్మలా సీతారామన్ ప్రకటించిన తాయిలాలకు అదనంగా ఇప్పుడు ఆర్బీఐ నగదును బదిలీ చేయడం ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగపడనుంది. గత ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ హయాంలో మిగులు మూలధనం చాలా అరుదుగా ఉండేది. దీంతో కేంద్రప్రభుత్వానికి ఆర్థిక కష్టాల నుంచి ఊరట లభించేది కాదు. ఈ క్రమంలోనే నవంబర్ 2018లో ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ను సమీక్షించేందుకు నిర్ణయించింది ఆర్బీఐ.
ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్ను సమీక్షించేందుకు గాను కమిటీని ఏర్పాటు చేయాలని భావించింది. అయితే కమిటీ ఏర్పాటుకు ముందే ఊర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్గా రాజీనామా చేశారు. కొత్త ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టగానే డిసెంబర్ 26వ తేదీన ప్యానెల్ను ఏర్పాటు చేయడం జరిగింది. 2013-14 సంవత్సరం నుంచి మిగులు నగదును ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ బదిలీ చేస్తూ వస్తోంది.