పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్లతో త్వరలో రూ. 200నోట్లు!: ఆర్బీఐ ప్రతిపాదన
భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలో రూ.200 నోట్లను తీసుకురానుంది. మార్చి నెలలో జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ముంబై: భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలో రూ.200 నోట్లను తీసుకురానుంది. మార్చి నెలలో జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వం దీనికి అనుమతి ఇస్తే జూన్ తరువాత నుంచి వీటి ముద్రణ ప్రారంభం కానుందని వెల్లడించాయి.
నోట్ల రద్దు అనంతరం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నా.. అవి అనుకున్నంత మేరకు లేకపోవడం, చిన్న నోట్ల కొరత కొనసాగుతుండడంతో రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కాగా, దీనిపై వ్యాఖ్యానించడానికి రిజర్వు బ్యాంకు అధికార ప్రతినిధి నిరాకరించారు.
గతంలో రూ.1000 నోటు తీసుకువస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఖండించిన విషయం తెలిసిందే. అయితే, నోట్ల కొరతను తీర్చేందుకు రూ.200 నోట్లు ఉపయోపడతాయనే యోచలో ఉన్న ఆర్బీఐ.. త్వరలోనే పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్లతో ఈ కొత్త నోట్లను తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నోట్ రద్దు తర్వాత కొత్త రూ.500, 2000 నోట్లను ఆర్బీఐ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.