రెపో రేట్ను 25 బేసిస్ పాయింట్ల మేరా తగ్గించిన ఆర్బీఐ... బ్యాంకు రుణాలపై వడ్డీ తగ్గే ఛాన్స్
ముంబై: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ రెండో సారి అధికారంలోకి వచ్చాక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలక వర్గం తొలిసారి భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేరా తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. రెపోరేట్ను 6శాతం నుంచి 5.75 శాతంకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రెపో రేటు అనగా ఇతర కమర్షియల్ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ వడ్డీకి రుణాలు ఇవ్వడం. ఆ వడ్డీనే రెపో రేట్గా పిలుస్తారు.
మందగిస్తున్న స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) నేపథ్యంలో పాలసీ సమీక్ష సమంయలో రెపోరేట్ను కనీసం 25 బేసిస్ పాయింట్ల మేరా తగ్గించాలని అనలిస్టులు కోరుకున్నారు. ముడిచమురు ధరలు పడిపోవడం, స్థిరంగా లేని ద్రవ్యోల్బణంను చూసి పరపతి విధాన సమీక్షను రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. ఒక బేసిస్ పాయింట్ ఒక పర్సెంటేజ్ పాయింట్లో 100వ వంతు. రెపో రేట్ను తగ్గించడం వల్ల ఇతర వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉందన్న సంకేతాలు పంపింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఇక రెపో రేట్ తగ్గించడం వల్ల వృద్ధి నమోదుపై ఆర్బీఐ దృష్టి సారించింది. మధ్యంతర సమయంలోగా అనుకున్న ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నమోదు మందగిస్తున్న సమయంలో రెపో రేట్ తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించడం శుభపరిణామం అని కొందరు మార్కెట్ నిపుణుల భావిస్తున్నారు. 2019 ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో దేశస్థూలఉత్పత్తి ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఇది 5.8 శాతానికి పడిపోవడంతో కొందరు ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఆర్థిక వ్యవస్థలో వార్షిక వృద్ధి 6.8శాతానికి పడిపోయింది.