కరోనా ఎఫెక్ట్ : రెపో రేటు తగ్గింపు.. జీడీపీ,డిపాజిట్లు,రుణాలపై ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటనలివే..
కరోనా వైరస్ కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా రెపో రేటును తగ్గిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపో రేటును 75శాతం బేసిస్ పాయింట్లకు తగ్గించి 4.40శాతానికి తీసుకొచ్చామని చెప్పారు. రివర్స్ రెపో రేటును కూడా 90శాతం తగ్గించామన్నారు. ఆర్థిక స్థిరత్వం కోసమే ఈ చర్యలు తీసుకున్నామని చెప్పిన శక్తికాంత దాస్.. ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని చెప్పారు.ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో భాగంగా ప్రధానంగా నాలుగు చర్యలు తీసుకోబోతున్నట్టు శక్తికాంత దాస్ తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రణాళికలను సిద్దం చేయడం,మార్కెట్లలో లిక్కిడిటీ స్థిరత్వం, బ్యాంకుల రుణాల ప్రక్రియలో నిలకడ,చెల్లింపుల్లో సడలింపు చర్యలు, మార్కెట్ అస్థిరతను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
వృద్ది రేటుపై ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారు..
కరోనా ఎఫెక్ట్ దీర్ఘకాలం కొనసాగితే భారత్ సప్లై చైన్ దెబ్బతినే అవకాశం ఉందని.. అదే జరిగితే వృద్ది రేటుపై కూడా ప్రభావం పడుతుందని చెప్పారు. అయితే ముడి చమురు ధరల తగ్గింపు ఆర్థిక రంగంపై సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. కరోనావైరస్ ప్రభావిత దేశాలలో లాక్ డౌన్స్, సోషల్ డిస్టెన్స్ వంటి కారణాలతో ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయని ద్రవ్య విధాన కమిటీ(MPC-Monetary Policy Committee) గుర్తించిందన్నారు. దశాబ్ద కాలంలో 2019లో నమోదైన కనిష్ట ప్రపంచ ఆర్థిక వృద్ది రేటు 2020లో కోలుకుంటుందన్న ఆశలు కూడా ఆవిరయ్యాయని చెప్పారు.
ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించే చర్యలు
కరోనా ఎఫెక్ట్ దేశ జీడీపీపై ప్రతికూల ప్రభావం చూపించిందన్నారు. దీన్ని అధిగమించే క్రమంలో అన్ని రకాల దీర్ఘకాలిక రుణాల చెల్లింపులపై తాత్కాలిక విరామం ప్రకటించినట్టు తెలిపారు. అలాగే అన్ని రకాల రుణాలపై మూడు నెలల వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు చెప్పారు. మార్చి 31 వరకు ఉన్న అన్ని రకాల రుణాలపై ఈఎంఐ చెల్లింపులకు మూడు నెలల విరామానికి బ్యాంకులకు అనుమతిస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం బ్యాంకులదే కావడం గమనార్హం. ఇక పాలసీ రేటుతో అనుసంధానించిన దీర్ఘకాలిక రెపో ఆపరేషన్ ఫ్లోటింగ్ రేటును మూడేళ్ల కాలానికి రూ.1లక్ష కోట్ల వరకు వేలం నిర్వహించాలని చెప్పారు.అన్ని వాణిజ్య బ్యాంకులు మరియు ఎన్బీఎఫ్సీ సహా అన్ని రకాల టర్మ్ లోన్ల వాయిదాల చెల్లింపుపై మూడు నెలల తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్టు తెలిపారు. అన్ని బ్యాంకుల క్యాష్ రివర్స్ రేషియో(CRR)ని 3శాతం నెట్ డిమాండ్కి తగ్గట్టుగా 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడానికి నిర్ణయించుకున్నట్టు చెప్పారు. మార్చి 28వ తేదీ నుంచి ఏడాది పాటు ఇది అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
డిపాజిట్లకు పూర్తి భద్రత...
ఇక ప్రభుత్వ,ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులో డిపాజిట్ల గురించి కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అందరి డబ్బు సురక్షితంగా ఉందని శక్తికాంత దాస్ వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో.. అనవసర ఆందోళనకు గురై పెద్ద మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. డిపాజిట్ల గురించి ఆందోళన అక్కర్లేదని.. అందరి డిపాజిట్లకు పూర్తి భద్రత ఉందని తెలిపారు. దిగజారుతున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా షెడ్యూల్ ప్రకారం మార్చి 31-ఏప్రిల్ 3 న జరగాల్సిన ఎంపిసి సమావేశాన్ని మార్చి 25-27 వరకు కొనసాగించినట్టు తెలిపారు... అనవసర ఆందోళనకు గురై పెద్ద మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. డిపాజిట్ల గురించి ఆందోళన అక్కర్లేదని.. అందరి డిపాజిట్లకు పూర్తి భద్రత ఉందని తెలిపారు.