అదంతా తప్పుడు ప్రచారమే.. బ్యాంకుల మూసివేతపై తేల్చేసిన ఆర్బీఐ
ముంబై : ప్రభుత్వరంగ బ్యాంకులు మూసివేయనున్నట్టు వస్తున్న వదంతులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వివరణ ఇచ్చింది. ఏ ఒక్క ప్రభుత్వరంగ బ్యాంకును మూసివేసే ప్రసక్తి లేదని ఆర్బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
'ప్రామ్ట్ కరెక్టివ్ యాక్షన్' (పీసీఏ) పేరుతో తాము చేపట్టనున్న కొన్ని చర్యల నేపథ్యంలో మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రభుత్వరంగ బ్యాంకులు మూసివేస్తున్నట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందని, అయితే అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని ఆర్బీఐ పేర్కొంది.
మరోవైపు కేంద్రం కూడా మీడియాలో వస్తున్న ఈ వదంతుల్లో ఎంతమాత్రం నిజం లేదని, పైగా ప్రభుత్వరంగ బ్యాంకుల బలోపేతానికి తాము యోచిస్తున్నట్టు కూడా తెలియజేసింది. ''బ్యాంకుల మూసివేత ప్రశ్నే లేదు. రూ.2.11 లక్షల కోట్ల రీక్యాపిటైలేజేషన్ ద్వారా పీఎస్బీలను మరింత బలోపేతం చేయనున్నాం. వదంతులు పుట్టించేవారిని నమ్మొద్దు. పీఎస్బీల సంస్కరణల రోడ్మ్యాప్ సిద్ధం చేస్తున్నాం..'' అని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ ఓ ట్వీట్లో తెలిపారు.
పీసీఏ ఫ్రేమ్వర్క్ అంటే ప్రభుత్వరంగ బ్యాంకులు కస్టమర్లకు అందించే రోజువారీ సేవలను నిలువరించడం కాదని, డిసెంబర్ 2002 నుంచి పీసీఏ విధానం అమల్లో ఉందని, దానిని ఇప్పుడు మరింత మెరుగుపరచనున్నామని ఆర్బీఐ తన వివరణలో పేర్కొంది. తమ పర్యవేక్షణలో బ్యాంకులను ఆర్థికంగా మరింత బలోపేతం చేయనున్నామని ఆర్బీఏ స్పష్టం చేసింది.