రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ రాజీనామా
ఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ నలుగురు డిప్యూటీ గవర్నర్లలో ఒకరైన విరాల్ ఆచార్య పదవికి రాజీనామా చేశారు. మరో ఆరు నెలల పదవీకాలం ఉండగానే ఆయన బాధ్యతల నుంచి వైదొలిగారు. 2017 జనవరి 23న రిజర్వ్ బ్యాంక్లో చేరిన ఆయన.. డిప్యూటీ గవర్నర్లలో అత్యంత చిన్న వయసు వాడు కావడం విశేషం. ఈ నెల ప్రారంభంలోనే ఆయన తన రాజీనామాను ఆర్బీఐకు సమర్పించినట్లు తెలుస్తోంది.
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ లాగే విరాల్ సైతం అకడమిక్స్పై ఆసక్తితో పదవి నుంచి వైదొలుగుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. గతంలో ఆయన న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎకనమిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారు. డిప్యూటీ గవర్నర్ పదవి నుంచి వైదొలగిన విరాల్ ఆగస్టులో తిరిగి న్యూయార్క్ వెళ్లి టీచింగ్ ప్రొఫెషన్ను చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య ఘర్షణాత్మక వైఖరి నెలకొన్న సమయంలో రిజర్వ్ బ్యాంక్కు స్వతంత్రత ఉండాల్సిందేనన్న తన అభిప్రాయాన్ని విరాల్ ఆచార్య గట్టిగా వినిపించారు. ఆర్బీఐ నిర్ణయాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిదికాదని అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారమే రేపాయి. డిప్యూటీ గవర్నర్లను నియంత్రించాల్సిన బాధ్యత తనపై ఉందని బీజేపీ నేతలు అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్కు సూచించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
కేంద్రంతో నెలకొన్న వివాదం నేపథ్యంలో గతేడాది ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పదవి నుంచి వైదొలగి ఆరు నెలలు గడవకముందే డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకేల్ పాత్ర, ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రిన్సిపల్ ఎకనమిక్ అడ్వైజర్ సంజీవ్ సన్యాల్లలో ఒకరు విరాల్ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.