ఎన్నికల వేళ కేంద్రానికి ఆర్బీఐ చెల్లించే వాటా ఎంతో తెలుసా..?
ప్రభుత్వానికి మధ్యంతర లాభాల్లో వాటా ఇవ్వడంపై రిజర్వ్ బ్యాంకు ఇంకా నిర్ణయించాల్సి ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే మార్చిలోగా ప్రభుత్వానికి లాభాల్లో వచ్చిన వాటా 40వేల కోట్ల రూపాయలను ఆర్బీఐ బ్యాంకు మార్చిలోగా బదిలీ చేయనున్నట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక రైటర్స్ వెల్లడించింది. ఈ ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోడీ సర్కార్ రెవిన్యూ లోటులో కూరుకుపోయిందని ఈసారి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సి ఉండటంతో ఈ మొత్తాన్ని ఆర్బీఐ బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేసిందని రైటర్స్ పత్రిక వెల్లడించింది.
ప్రభుత్వానికి ఆర్బీఐకి మధ్య ఎన్నో చర్చలు జరుగుతాయని చెప్పిన శక్తికాంత దాస్... ఒక నిర్ణయం తీసుకున్నామంటే అది ప్రకటించడంలో ఎలాంటి జాప్యం జరగదని స్పష్టం చేశారు. గత నెలలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ గర్గ్ మాట్లాడుతూ ఆర్బీఐ నుంచి లాభాల్లో మధ్యంతర వాటా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరుతోందని వెల్లడించారు. ఈ క్రమంలోనే మొత్తం పెట్టుబడుల వ్యవస్థపై ఓ నివేదిక ఇవ్వాల్సిందిగా కోరుతూ ఓ ప్యానెల్ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఆర్బీఐ ద్రవ్యలోటు పరిస్థితిని పర్యవేక్షిస్తోందని దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి భంగం వాటిల్లకుండా పనిచేస్తోందని శక్తికాంత దాస్ అన్నారు. ఆర్బీఐ తీసుకున్న కఠిన నిర్ణయాలతో వ్యాపారాలు దెబ్బతిన్నాయని, రుణాలు ఎగవేతదారులతో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. గత మూడేళ్లలో రుణాలు ఎగవేతదారులతోనే ఎక్కువ ఇబ్బందులు ఎదురయ్యాయని వెల్లడించారు. వీటన్నిటినీ త్వరలోనే అధిగమిస్తామనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు శక్తికాంత దాస్.