నేపాల్ కష్టాలకు ఆర్బీఐ చెక్: 100కోట్ల రూ.100 నోట్ల పంపిణీ!
నేపాల్కు రూ.100కోట్ల విలువైన రూ.100ల నోట్లను పంపిణీ చేసేందుకు ఆర్బీఐ అంగీకరించింది.
న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంక్.. మన సరిహద్దు పొరుగు దేశమైన నేపాల్ ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలను చేపట్టింది. నేపాల్కు రూ.100కోట్ల విలువైన రూ.100ల నోట్లను పంపిణీ చేసేందుకు ఆర్బీఐ అంగీకరించింది. దీంతో భారత్లో పెద్ద నోట్లరద్దు ప్రభావంతో సతమతవుతున్న నేపాల్ ప్రజలకు ఉపశమనం కలిగించినట్లయింది.
మన సరిహద్దు దేశమైన నేపాల్లో భారత కరెన్సీ భారీగానే చలామణీలో ఉంది. ముఖ్యంగా సరిహద్దు పరిసర ప్రాంతాల ప్రజలకు భారత కరెన్సీ అవసరం అధికంగా ఉంటుంది. వివిధ అవసరాల నిమిత్తం నిత్యం వేలాదిమంది నేపాలీలు భారత్కు వచ్చి వెళ్తుంటారు.
కాగా, రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం గత నవంబర్ 8న తీసుకున్న నిర్ణయంతో నేపాల్లోనూ తీవ్ర ప్రభావం పడింది. దీంతో నోట్ల మార్పిడికి ఇబ్బందులు తలెత్తాయి. మనదేశంలోలానే అక్కడ కూడా రూ. 100నోట్లకు తీవ్ర కొరత ఏర్పడింది.
గత కొంతకాలంగా తమ దేశంలోని కరెన్సీని చలామణీ చేసుకొనేందుకు అవకాశం కల్పించాలని నేపాల్ రాష్ట్ర బ్యాంకు కోరుతున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఆర్బీఐ అక్కడి ప్రజల అవస్థల్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జనవరి నెలాఖరులోగా నేపాల్కు రూ.వంద కోట్ల విలువైన రూ.100 నోట్లను ఆర్బీఐ పంపించే అవకాశాలున్నాయి.
కాగా, నేపాల్లో అధికారికంగా రూ. 100కు అక్కడి కరెన్సీ రూ. 160తో సమానం. అయితే, నోట్ల రద్దు దగ్గర్నుంచి రూ. 100కు అక్కడి రూ. 175 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.