ఆర్బీఐ యాక్షన్ ప్లాన్-2 : ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు.. శక్తికాంత దాస్ కీలక ప్రకటనలివే..
కరోనా వైరస్ కారణంగా దేశంలో తలెత్తనున్న ఆర్థిక సంక్షోభం,అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు,క్షేత్ర స్థాయి పరిస్థితులను వివరించేందుకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా ముందుకు వచ్చారు. దేశంలో క్షేత్ర స్థాయి పరిస్థితులను ఆర్బీఐ ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోందన్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ అక్టోబర్ 1931,లండన్లో చెప్పిన ఓ మాటను గుర్తుచేసుకున్నారు. 'మరణం మధ్యలో జీవితం కొనసాగుతుంది, అసత్య సత్యం మధ్యలో కొనసాగుతుంది, చీకటి మధ్యలో కాంతి కొనసాగుతుంది..' అన్న గాంధీ మాటలే స్పూర్తిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
Recommended Video
నాలుగు కీలక చర్యలు
స్థూల ఆర్థిక పరిస్థితి కొన్నిచోట్ల బాగుందని.. మరికొన్ని చోట్ల తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందని చెప్పారు. ఇటీవల ఐఎంఎఫ్ వెల్లడించిన భారత జీడీపీ అంచనాలను ప్రస్తావించారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆర్బీఐ నాలుగు ప్రత్యేక చర్యలను తీసుకుంటోందని తెలిపారు. 1) తగినంత ద్రవ్య వ్యవస్థను ప్రోత్సహించడం 2) ప్రోత్సాహక క్రెడిట్ ప్రవాహం 3) ఆర్థిక ఒత్తిడిని తగ్గించడం 4) మార్కెట్ల పనితీరుకు సానుకూల అవకాశాలు వంటి చర్యలను తీసుకోబోతున్నట్టు వెల్లడించారు.
సానుకూల జీడీపీ
అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ మార్కెట్లన్నీ అస్థిరతతో సతమతమవుతున్నాయని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ముడి చమురు ధరలు కూడా అస్థిరతను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. అయితే ఇంతటి సంక్షోభంలోనూ సానుకూల జీడీపీ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి అని చెప్పారు. పారిశ్రామిక ఉత్పత్తుల ఇండెక్స్పై కోవిడ్-19 ప్రభావాన్ని ఇంతవరకు అంచనా వేయలేదని.. కాబట్టి తప్పుదారి పట్టించే డేటాను పట్టించుకోవద్దన్నారు. దేశంలో ఖరీఫ్ ఔట్పుట్ 37శాతం ఉందన్నారు. నెట్ బ్యాంకింగ్,మొబైల్ బ్యాంకింగ్ సేవల్లో తగ్గుదల లేదని తెలిపారు.
రాష్ట్రాలకు 60శాతం ఎక్కువ నిధులు
చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.50వేల కోట్లు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్రాలకు 60శాతం ఎక్కువ నిధులు, నాబార్డ్,సిడ్బీ,ఎన్హెచ్బీలకు రీఫైనాన్సింగ్ కోసం రూ.50వేల కోట్లు అందజేయనున్నట్టు తెలిపారు. రివర్స్ రెపో రేటును 25 బేస్ పాయింట్స్ నుంచి 3.75శాతానికి తగ్గించినట్టు తెలిపారు.
బ్యాంకుల సంగతేంటి...
ఏప్రిల్ 15 నాటికి ఆర్థిక వ్యవస్థలో వద్ద 6.91కోట్లు మిగులు ఉందని.. బ్యాంకులు దీన్ని ఉపయోగించుకునేందుకు రివర్స్ రెపో రేటును 25 బేస్ పాయింట్ల మేర తగ్గించి 4 శాతం నుంచి 3.75శాతానికి తీసుకొస్తున్నట్టు చెప్పారు. ద్రవ్య వినిమయ సర్దుబాటు కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఆర్బీఐ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు బ్యాంకులు డివిడెంట్స్ను ప్రకటించవద్దని శక్తికాంత దాస్ తెలిపారు. తక్షణ చర్యల్లో భాగంగా బ్యాంకుల లిక్విడిటీ కవరేజీని 100శాతం నుంచి 80శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు. ఇది అక్టోబర్ 2020 నాటికి 90శాతం పునరుద్దరించబడుతుందని.. ఏప్రిల్ 2021 నాటికి 100 శాతం పునరుద్దరించబడుతుందని తెలిపారు.నాన్ పెర్ఫామింగ్ అసెట్స్ (NPA)వర్గీకరణకు సంబంధించి మారటోరియంను మినహాయిస్తున్నట్టు తెలిపారు. ఎన్పీఏ రిసల్యూషన్ ప్లాన్ 90 రోజులకు పొడగిస్తున్నట్టు తెలిపారు.లక్ష్యంగా పెట్టుకున్న రూ.25వేల కోట్ల లాంగ్-టర్మ్ రెపో ఆపరేషన్కు నేడు వేలం జరుగుతుందన్నారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు పొందిన కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఇదే తరహాలో మినహాయింపులు ఉంటాయన్నారు.
పెరిగిన ఫుడ్ రేట్లు,తగ్గిన ఎల్పీజీ
మారటోరియం వర్తించే అన్ని ఖాతాలపై అసెట్ క్లాసిఫికేషన్ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణగ్రహీతలకు రిలీఫ్ను ప్రకటించే స్థితిలో ఉన్నాయన్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో ఆహార పదార్థాల ధరలు ఏప్రిల్ 13 నాటికి 2.3శాతం పెరిగినట్టు తెలిపారు. అయితే ఉల్లి ధరల్లో తగ్గుదల కొనసాగుతూనే ఉందన్నారు. ఏప్రిల్ మొదటి 15 రోజుల్లో పీడీఎస్ కిరోసిన్ ధరలు 24శాతం తగ్గినట్టు చెప్పారు. అలాగే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర విలువ 8శాతం తగ్గిందన్నారు. దేశంలో విద్యుత్ డిమాండ్ 30శాతం మేర తగ్గిందన్నారు. ఈ లెక్కలన్నీ ద్రవ్యోల్బణం క్షీణతను సూచిస్తున్నాయని.. జనవరి 2020 నాటికి అది 170 బేసిక్ పాయంట్లకు పతనమై గరిష్ట స్థాయికి చేరుకుందని తెలిపారు.