కరోనా బారినపడ్డ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్... ఐసోలేషన్ నుంచే వర్క్...
ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గవర్నర్ శక్తికాంత దాస్ కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలేవీ లేకపోయినప్పటికీ టెస్టుల్లో పాజిటివ్గా తేలిందన్నారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని... ఇటీవల తనను కలిసినవాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఐసోలేషన్ నుంచే తన విధులు నిర్వర్తిస్తానని చెప్పారు. ఆర్బీఐ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు,ఇతర అధికారులందరితో వీడియో కాన్ఫరెన్స్,టెలిఫోన్ ద్వారా టచ్లో ఉన్నానని చెప్పారు. ఈ విషయాలన్నీ శక్తికాంత దాస్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ప్రస్తుతం భారత్లో కరోనా కేసుల సంఖ్య 78,66,740గా ఉంది. ఇందులో 6,69,409 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ 70,77,406 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1,18,593 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఇప్పటివరకూ 16,38,961 కేసులు నమోదవగా... 8,04,206 కేసులతో ఆంధ్రప్రదేశ్,7,98,378 కేసులతో కర్ణాటక ఆ తర్వాతి స్థానాలో ఉన్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 50,129 కేసులు నమోదయ్యాయి. ఆదివారం(అక్టోబర్ 24) కరోనా పేషెంట్ల రికవరీ రేటు 90శాతానికి చేరడం గమనార్హం. కరోనాను ఎదుర్కోవడంలో ఇదో కొత్త మైలు రాయి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పటినుంచే వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రణాళికలను కేంద్రం సిద్దం చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వ,ప్రైవేట్ హెల్త్ వర్కర్స్ డేటా బేస్ను తయారుచేసే ప్రక్రియపై కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ వివరాలను ఈ- విన్ (ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటలిజెన్స్ నెట్వర్క్) కింద కొవిడ్ వ్యాక్సిన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ సిస్టంలో అప్లోడ్ చేయాలని సూచించింది.
RBI Governor Shaktikanta Das tests positive for #COVID19, says he will continue to work from isolation. pic.twitter.com/Kf6L7wUe4e
— ANI (@ANI) October 25, 2020