ఊదారంగులో, నయా ఫీచర్లు: కొత్త రూ.100నోటు చూశారా?
ముంబై: భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) గురువారం కొత్త వందరూపాయల నోటును విడుదల చేసింది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఈ నోటుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది.
ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో గుర్తింపు పొందిన గుజరాత్లోని 'రాణి కీ వావ్'ఫొటో నోటు వెనుక భాగంలో ముద్రించారు. కొత్త వందనోటు ఊదా రంగులో ఉంది. ఈ నోటు 66ఎంఎం X 142ఎంఎం ఉంది. ఈ నోటుపై స్వచ్ఛ భారత్ లోగో, ఏ సంవత్సరంలో ముద్రించారు అనే వివరాలు కూడా ఉంటాయి.
కొత్త వంద నోటు పది రూపాయల నోటు కంటే కొద్దిగా పెద్దగా.. పాత వంద నోటు కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. దీవస్లోని ముద్రణా కార్యాలయంలో కొత్త వంద నోట్ల ముద్రణ ఇప్పటికే ప్రారంభమైంది.
వీలైనంత త్వరలోనే ఈ కొత్త వంద నోట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ తెలిపింది. ఈ నోటులో కొత్తగా కొన్ని మైక్రో సెక్యూరిటీ ఫీచర్లను చేర్చినట్లు వెల్లడించింది. ఈ ఫీచర్లు అతినీలలోహిత కాంతిలో మాత్రమే కనిపిస్తాయి. కాగా, పాత వంద నోట్లు కూడా చెలమణీలో కొనసాగుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.