రిజర్వ్ బ్యాంక్ సంచలనం: త్వరలో కొత్త రూ.10 నోట్లు
న్యూఢిల్లీ: పది రూపాయల నోట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త పది రూపాయల నోట్లను ముద్రించాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడమే కాకుండా వాటి ముద్రణను కూడా ప్రారంభించింది.
మహాత్మాగాంధీ సిరీస్ కింద చాక్లెట్ బ్రౌన్ రంగుతో కొత్త పది రూపాయల నోటును విడుదల చేస్తుందని సమాచారం. త్వరలోనే వాటిని విడుదల చేసేందుకు ఆర్బీఐ సిద్దమైంది. ఇందులో బాగంగా ఇప్పటికే 100 కోట్ల నోట్లను ముద్రించినట్టు తెలుస్తోంది.
ఓ జాతీయ మీడియా సంస్థ ఇందుకు సంబంధించిన వార్తాకథనాన్ని ప్రచురించింది. వారం రోజుల క్రితమే కొత్త పదిరూపాయల నోటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. కొత్త పది రూపాయల నోట్లపై కోణార్క్ సూర్యదేవాలయం చిత్రం ఉంటుందని చెబుతున్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న పది రూపాయల నోటు డిజైన్ను చివరిసారిగా 2005లో మార్చారు. నిరుడు ఆగస్టులో మహాత్మాగాంధీ సిరీస్లో రూ.50, రూ.200 కొత్తనోట్లు చెలామణీలోకి వచ్చిన విషయం తెలిసిందే.
నకలీ నోట్ల బెడదను తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో 2016 నవంబర్ 8న 86 శాతంగా ఉన్న రూ.500, రూ.1000 నోట్లను ప్రధాని మోదీ రాత్రికి రాత్రే రద్దు చేసిన సంగతి తెలిసిందే.