తేరుకున్న స్టాక్ మార్కెట్లు.. మెరిసిన బంగారం, బలపడిన రూపాయి
ముంబై: అమెరికా స్టాక్ మార్కెట్ల ప్రభావానికి లోనై భారీ పతనా్ని చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కోలుకున్నాయి. ఆరంభంలోనే డబుల్ సెంచరీ లాభాలను సాధించాయి. యూరప్, ఆసియా తదితర గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మన స్టాక్ మార్కెట్ల కీలక సూచీలు లాభపడుతున్నాయి.
ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్ 242 పాయింట్లు లాభంతో 34,438 వద్ద, 83 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ 10,581 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని సెక్టార్లులాభాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో, మెటల్, వాల్యూ బైయింగ్ ట్రెండ్ మార్కెట్లను లీడ్ చేస్తోంది.
ఆర్బీఐ పాలసీ రివ్యూ నేపథ్యంలో...
బుధవారం రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో మదుపరులు కొంత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశాలున్నాయని, లాభ నష్టాల మధ్య స్టాక్ మార్కెట్లు ఊగిసలాడవచ్చని మార్కెట్ విశ్లేషకులు ముందుగానే పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగానే కొన్ని షేర్లు లాభపడుతుండగా మరికొన్ని సంస్థల షేర్లు నష్టాల బాటలో నడుస్తున్నాయి. బుధవారం ఉదయం హెచ్పీసీఎల్, వేదాంత, బీపీసీఎల్, హీరో మోటోకార్ప్, హిందాల్కో షేర్లు లాభాల్లో దూసుకుపోతుండగా.. లుపిన్, హిందుస్తాన్ యూనిలీవర్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
కీలక వడ్డీరేట్లు యధాతథం...
ఇటీవలి బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాల కారణంగా బుధవారం నాటి ఆర్బీఐ పరపతి విధానం సమీక్షలో కీలకమైన పాలసీ రేట్లను మార్చకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కనీసం 2019 ఏడాది సగం వరకు కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని, రెపో రేటు 6 శాతం, రివర్స్ రిపో 5.75 శాతం వద్ద ఉంచవచ్చనే అభిప్రాయం ఆర్థికరంగ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉండడంతో.. రాబోయే కాలంలో ధరల అదుపునకు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లలో మార్పులు చేసే ఆలోచన ఆర్బీఐ చేయకపోవచ్చని వారి విశ్లేషణ. ఆర్బీఐ కూడా అదే చేసింది. రెపో రేటును, కీలక వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచింది.
దేశీయంగా మెరిసిన బంగారం...
అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పడిపోయినప్పటికీ భారత్లో మాత్రం బంగారంపట్ల మక్కువ అంతకంతకూ పెరిగిపోతోంది. మంగళవారమే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కొన్ని గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం... అంతర్జాతీయంగా 2016లో బంగారం వినియోగం 4,362 టన్నులుకాగా గత ఏడాది.. అంటే 2017లో ఇది 7 శాతం క్షీణించి 4,071 టన్నులకు చేరింది. గోల్డ్ కాయిన్లు, గోల్డ్ బార్ల డిమాండ్ సైతం 2 శాతం తగ్గింది. నూతన పన్ను చట్టం జీఎస్టీ స్థిరపడటం, స్టాక్ మార్కెట్ల ర్యాలీ, జీడీపీ వృద్ధి, ఆభరణాల కొనుగోళ్లకు యాంటీ మనీ లాండరింగ్ చట్టాన్ని తొలగించడం.. ఇవన్నీ కలిసి బంగారం విషయంలో వినియోగదారుల సెంటిమెంట్ను మెరుగుపరిచాయి.
బలపడిన రూపాయి...
అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో బుధవారం దేశీయ స్టాక్మార్కెట్లు 200 పాయింట్లకు పైగా ఎగిశాయి. మరోవైపు డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బలపడింది. బుధవారం 20 పైసలు పెరిగి 64.04 వద్ద ప్రారంభమైంది. విదేశీ కరెన్సీలతో డాలర్ బలహీనపడటంతోపాటు, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రారంభ లాభాలు రూపాయికి మద్దతునిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో రూపాయి మరింతగా లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బ్యాంకింగ్ సెక్టార్లోని లాభాలు కూడా రూపాయి విలువ బలపడటానికి మద్దతునిస్తున్నాయి.