ఖాతాదారుల కొంపముంచిన యస్ బ్యాంకు: విత్ డ్రాలపై పరిమితి: రిజర్వుబ్యాంకు ఆధీనంలోకి.. !
ముంబై: ప్రైవేటు బ్యాంకింగ్ రంగానికి చెందిన యస్ బ్యాంకు ఖాతాదారుల కొంప ముంచే స్థితికి చేరుకుంది. చాలాకాలం నుంచీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న ఈ బ్యాంకును రిజర్వుబ్యాంకు స్వాధీనం చేసుకుంది. నగదు ఉపసంహరణపై ఆంక్షలను విధించింది. ఇకపై ఖాతాదారులు తమ అకౌంట్ల నుంచి 50 వేల రూపాయల వరకు మాత్రమే నగదును ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని రిజర్వుబ్యాంకు వెల్లడించింది.
Recommended Video
అన్ని రకాల ఖాతాలకూ వర్తింపు
దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటికే అమల్లోకి వచ్చేశాయి కూడా. ఈ ఆంక్షలు వచ్చేనెల 3వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ తరువాత బ్యాంకు పరిస్థితి, ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని.. ఈ ఆంక్షలను సడలించడమో లేదా.. సవరించడమో చేస్తామని రిజర్వుబ్యాంకు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ వెలువడింది. అన్ని రకాల బ్యాంకు ఖాతాలు.. అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు, రుణాలు, సేవింగ్స్, కరెంట్ ఖాతాల లావాదేవీలనూ దీని పరిధిలోకి తీసుకొచ్చింది. నగదు ఉపసంహరణలు రూ.50వేలు మించడానికి వీలు లేదని స్పష్టం చేసింది.
రూ.50 వేల పరిమితి మించితే..
50 వేల రూపాయల పరిమితికి మించిన నగదును ఉపసంహరించుకోవాల్సి వస్తే.. ముందుగా రిజర్వుబ్యాంకు అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తాన్ని ఎందుకు ఉపసంహరించుకోవాల్సిన అవసరం వచ్చిందనే విషయంపై రిజర్వుబ్యాంకు అధికారులకు సహేతుకమైన కారణాన్ని వివరించాల్సి ఉంటుంది. వైద్యం, విద్యావకాశాలు, శుభకార్యాలు వంటి కారణాలను సహేతుకంగా చూపించగలిగితే 50 వేల రూపాయలకు మించి కొంత మొత్తాన్ని అదనంగా తీసుకునే వెసలుబాటు కల్పించింది.
ఎస్బీఐ మాజీ సీఎఫ్ఓ పర్యవేక్షణలో..
యస్ బ్యాంకు ఖాతాదారుల ఇబ్బందులు, వారి లావాదేవీలను పర్యవేక్షించడానికి రిజర్వుబ్యాంకు ప్రత్యేకంగా భారతీయ స్టేట్ బ్యాంకు మాజీ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్ఓ) ప్రశాంత్ కుమార్ను నియమించింది. భారతీయ స్టేట్బ్యాంకు, జీవిత భీమా సంస్థ (ఎల్ఐసీ) సహా కొన్ని ఇతర ప్రైవేటు బ్యాంకులు.. యస్ బ్యాంకును ఆర్థికంగా ఆదుకోవడానికి ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. 15 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడి మొత్తాన్ని బ్యాంకు మూలధనంగా అందజేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. తమ ప్రతినిధిగా ప్రశాంత్ కుమార్ పేరును సూచించినట్లు సమాచారం.
మొండిబకాయిలే కారణమా?
బ్యాంకు ఈ దుస్థితికి చేరుకోవడానికి ప్రధాన కారణం.. మొండిబకాయిలేనని తెలుస్తోంది. ఈ బ్యాంకు పరిధిలో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి యస్ బ్యాంకు మొండి బకాయిల విలువ 2299 కోట్ల రూపాయలు. అప్పటి నుంచి ఎలాంటి ఫలితాలను కూడా విడుదల చేయట్లేదా బ్యాంకు యాజమాన్యం. పేరుకు పోయిన మొండిబకాయిలను చూసి.. ఏ పెట్టుబడిదారులు కూడా ముందుకు రాలేదు. ఫలితంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.