తీవ్ర సంక్షోభంలోకి బ్యాంకింగ్ వ్యవస్థ: ఆర్బీఐ అప్రమత్తంగా లేదంటూ అభిజిత్ బెనర్జీ
కోల్కతా: భారత బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోబోతోందని హెచ్చరించారు నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీ. తక్షణం బ్యాంకింగ్ రంగానికి ఉద్ధీపన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, దీనిపై ఆర్బీఐ కూడా అంత అప్రమత్తంగా లేదని అన్నారు.
బుధవారం అభిజిత్ బెనర్జీ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పీఎంసీ బ్యాంక్ కుంభకోణం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం సమస్యలను ఎదుర్కొంటోందని, చాలా కాలంగా గందరగోళ విధానాలు అవలంబించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు.
బ్యాంకులకు సరిపడా మూల ధనాన్ని సమకూర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, బ్యాంకింగ్ రంగాన్ని ఆదుకునేంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదని అన్నారు. సంక్షోభానికి ప్రభావితమైన బ్యాంకుల అమ్మకానికి కూడా ఈ పరిస్థితి దారితీయవచ్చునని అభిప్రాయపడ్డారు.
ఆర్థిక సంక్షోభానికి గురయ్యే బ్యాంకుల సంఖ్య పెరిగే అవకాశముందని, ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ప్రభావిత బ్యాంకులను విక్రయించి తద్వారా నిధులు సమకూర్చుకోవచ్చని, మిగితా బ్యాంకులకు ఉద్దీపన కల్పించవచ్చని వ్యాఖ్యానించారు. భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీకి ఇటీవల ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చిన విషయం తెలిసిందే.
మనదేశంలోని పశ్చిమబెంగాల్కు చెందిన ఆర్థిక శాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు. ఆయన సతీమణికి కూడా నోబెల్ పురస్కారం దక్కడం విశేషం. రాష్ట్రపతి, ప్రధాని.. అభిజిత్కు నోబెల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పేదరికంలో పుట్టిన తాను పేదరికాన్ని దగ్గర్నుంచి చూడటం వల్లే ఆర్థిక శాస్త్రంలో ఈ స్థాయికి ఎదిగానని అభిజిత్ పేర్కొనడం గమనార్హం.