శుభవార్త: ఎండిఆర్ ఛార్జీల్లో మార్పులు, చిన్న వ్యాపారులకు ఊరట
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకొంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీలపై ఛార్జీలను వసూలు చేయడంతో చిన్న వ్యాపారాలు డిజిటల్ లావాదేవీలపై విముఖత చూపుతున్నారు.డెబిట్ కార్డు లావాదేవీలపై వసూలు చేసే మర్చంట్ డిస్కౌంట్ రేట్ల(ఎమ్డీఆర్)ను సవరిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. అయితే డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు పడుతున్నాయి. అయితే వ్యాపారులు ఈ ఛార్జీలను వినియోగదారులపై మోపుతున్నారు.
కొన్ని సందర్భాల్లో డిజిటల్ లావాదేవీలకు వ్యాపారులు అంగీకరించడం లేదు.దీంతో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు గాను ఎండిఆర్ను మారుస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకొంది.
ఎండిఆర్లో మార్పులు
డిజిటల్ చెల్లంపులకు వీలుగా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీలను ఛార్జీలను తగ్గించాలని నిర్ణయం తీసుకొన్నారు. డెబిట్ కార్డు లావాదేవీలపై వసూలు చేసే మర్చంట్ డిస్కౌంట్ రేట్ల(ఎమ్డీఆర్)ను సవరిస్తూ మంగళ, బుధవారాల్లో జరిగిన పరపతి విధాన కమిటీ (ఎమ్పీసీ) సమావేశంలో నిర్ణయించారు. చిన్న, పెద్ద వ్యాపారుల సౌకర్యార్థం వేర్వేరు పరిమితులతో(డిఫరెన్షియేటెడ్ ఎమ్డీఆర్) ముందుకొచ్చింది. అయితే వ్యాపారుల ఆధారంగా ఈ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.
20 లక్షల వార్షిక టర్నోవర్ వ్యాపారులకు ఇలా
రూ.20 లక్షల వరకు వార్షిక టర్నోవరు ఉన్న చిన్న వర్తకులకు పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) లేదా ఆన్లైన్ లావాదేవీ ద్వారా జరిపే ఒక్కో లావాదేవీపై 0.4 శాతం లేదా గరిష్ఠంగా రూ.200 ఎమ్డీఆర్ను విధిస్తారు. అదే క్యూఆర్(క్విక్ రెస్పాన్స్) కోడ్ ద్వారా లావాదేవీ జరిగితే ఆ ఛార్జీ 0.3% లేదా గరిష్ఠంగా రూ.200 ఉంటుంది.
రూ.20 లక్షల టర్నోవర్ దాటితే
వార్షిక టర్నోవరు 20 లక్షలపైబడి ఉంటే.. వారిపై ఎమ్డీఆర్ ఛార్జీ కింద ఒక్కో లావాదేవీపై 0.90 శాతం లేదా గరిష్ఠంగా రూ.1000 ఉంటుంది. క్యూఆర్ ద్వారా అయితే 0.8% లేదా గరిష్ఠంగా రూ.1000 వసూలు చేస్తారు.
కొత్త ఛార్జీలు జనవరి 1 నుండి
మారిన రేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అనుమతించిన పరిమితికి మించకుండా ఎమ్డీఆర్ వసూలు అయిందా లేదా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులదేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. చిన్న వర్తకులు కూడా డెబిట్ కార్డు లావాదేవీలను అంగీకరించేలా చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. గతేడాది డిసెంబరులో రూ.1000 వరకు లావాదేవీలపై 0.25% ఎమ్డీఆర్; రూ.1000-2000 లావాదేవీపై 0.5 శాతంగా నిర్ణయించింది. అంతకు ముందు రూ.2000 వరకు లావాదేవీలపై 0.75%; రూ.2000 పైబడిన లావాదేవీలపై 1 శాతం చొప్పున ఎమ్డీఆర్ ఉండేది.