రైతులు, పేదలకు ఎంతో మేలు: ఆర్బీఐ చర్యలపై ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) శుక్రవారం ప్రకటించిన కీలక నిర్ణయాలపై ప్రధాని నరేంద్ర మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. పేదలు, రైతులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయని మోడీ వ్యాఖ్యానించారు.
మోడీ మరో ఉక్కు మనిషి, కేసీఆర్ వజ్రం: నాగబాబు ప్రశంసలు, జగన్పై పరోక్షంగా..
తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాల వల్ల ద్రవ్య లభ్యత, రుణ సరఫరా సామర్థ్యం పెరిగిందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. చిన్నస్థాయి పరిశ్రమలు, ఎంఎన్ఎంఈలు, రైతులు, పేదలు ఎంతగానో లబ్ధిపొందనున్నారని ప్రధాని వివరించారు. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్(డబ్ల్యూఎంఏ) పరిమితి పెంపు వల్ల రాష్ట్రాలు కూడా ప్రయోజనం పొందుతాయని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
కరోనా కట్టడి కోసం మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను పొడిగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజల ప్రాణాలే మొదటి ప్రాధాన్యతగా చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోడీ చెప్పారు.
కాగా, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థపై కరోనావైరస్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో సంక్షోభంలో నెలకొందని తెలిపారు. 1930 తర్వాత ఇంతటి సంక్షోభం ఎప్పుడూ ఎదుర్కోలేదని వెల్లడించారు.
Today’s announcements by @RBI will greatly enhance liquidity and improve credit supply. These steps would help our small businesses, MSMEs, farmers and the poor. It will also help all states by increasing WMA limits.
— Narendra Modi (@narendramodi) April 17, 2020
ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, చమురు ధరలు భారీ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయని గుర్తు చేశారు. వృద్ధిరేటు పాజిటివ్గా ఉన్న అతికొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటని అన్నారు. 2020లో భారత్ 1.9శాతంగా ఉండనుందని చెప్పారు. జీ20 దేశాల్లోకెల్లా ఇదే అత్యధికమని తెలిపారు.
కరోనావైరస్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఆర్బీఐ పలు కీలక ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రాలు డబ్ల్యూఎంఏ పరిమితిని 60శాతానికి పెంపు, సూక్ష్మ ఆర్థిక సంస్థలకు రూ. 50వేల కోట్లు, నాబార్డుకు రూ. 25వేల కోట్లు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది.