ఆర్థిక రంగంలో ఒడిదుడుకులు: వరుసగా ఏడేళ్లుగా క్షీణిస్తోన్న కార్పొరేట్ సంస్థల పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోందా? దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు వెనుకాడుతున్నాయా? అని ప్రశ్నిస్తే.. అవుననే చెబుతున్నాయి రిజర్వుబ్యాంకు నివేదికలు. ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల పెట్టుబడుల్లో వరుసగా ఏడేళ్ల పాటు క్షీణత నమోదైంది. ఏ దశలోనూ పుంజుకునే పరిస్థితులు కనిపించలేదు. దశలవారీ మూలధన వ్యయం (క్యాపెక్స్)తో ముడిపడి ఉన్న ప్రణాళికల్లో 10.15 శాతం భారీ పతనమే దీనికి కారణమని రిజర్వుబ్యాంకు నివేదిక చెబుతోంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 1,65,500 కోట్ల రూపాయల మేర నమోదైన క్యాపెక్స్ గణాంకాలు.. 2017-18 ఆర్థిక సంవత్సరానికి 1,48,700 కోట్ల రూపాయలకు పడిపోయింది.
నిజానికి..2010-11 ఆర్థిక సంవత్సరంలో నేల ముఖం పట్టిన క్యాపెక్స్.. ఏ దశలోనూ పుంజుకోలేక పోయింది. మొత్తం 3,70,600 కోట్ల రూపాయలతో ఈ క్షీణత ఆరంభమైంది. క్రమంగా.. తిరోగమిస్తూ, 1,48,700 కోట్ల రూపాయలకు పడిపోయింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో మరింత క్షీణించవచ్చని రిజర్వుబ్యాంకు అంచనా వేస్తోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు కార్పొరేట్ సంస్థల మూల ధన వ్యయం 1,48,700 కోట్ల రూపాయలు నమోదు కాగా, ప్రస్తుతానికి ఈ సంఖ్య 80,200 కోట్ల రూపాయల వద్ద ఉందని రిజర్వుబ్యాంకు అధికారులు చెబుతున్నారు. 2018-18 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ప్రస్తుతం నిర్మాణాల్లో ఉన్న ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన ప్రణాళికలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ.. ఈ గణాంకాల్లో భారీగా పెరుగుదల చోటు చేసుకోలేకపోవచ్చని అంటున్నారు.
ప్రభుత్వ గణాంకాలు, జీడీపీలో రాజకీయ నేతల జోక్యంపై ఆర్థికవేత్తల ఆందోళన
ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు రూపొందించుకున్న ప్రణాళికలు, మొదలు పెట్టదలచిన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చకపోవడమే ఈ పరిస్థితికి కారణమని రిజర్వుబ్యాంకు నివేదిక స్పష్టం చేస్తోంది. కార్పొరేట్ సంస్థలు చాలావరకు తమ ప్రాజెక్టులను రద్దు చేసుకున్నాయని, దీని ప్రభావం దేశ ఆర్థికరంగ పురోగమనంపై దుష్ప్రభావాన్ని చూపిస్తోందని విశ్లేషిస్తున్నారు. దీనికితోడు, అమల్లో ఉన్న ప్రాజెక్టులు కూడా నెమ్మదించడం ఆర్థిక రంగాన్ని కుదేలు చేస్తోందని అంటున్నారు. ప్రాజెక్టుల రద్దు, మందగించడం వల్ల 10 లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల రుణాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి.
2018-19 ఆర్థిక సంవత్సరం ఆరంభంలో క్యాపెక్స్ కొంత మెరుగు పడినప్పటికీ.. అనంతరం అదే వేగాన్ని చివరి వరకూ కొనసాగించలేకపోయాయి. కార్పొరేట్ సంస్థల మూలధన వ్యయం, పెట్టుబడులు వ్యవహారం వేగం పుంజుకుందని, దీనికి కారణం.. ఆయా సంస్థలు ప్రారంభించిన ప్రాజెక్టులే కారణమని రిజర్వుబ్యాంకు నివేదిక స్పష్టం చేస్తోంది. పెట్టుబడుల్లో ఆశించిన స్థాయిలో వేగం పుంజుకోనప్పటికీ.. ఫర్వాలేదనిపిస్తున్నాయని, ఆర్బీఐ నివేదిక అంచనా వేస్తోంది. కార్పొరేట్ సంస్థల ఆర్థిక లావాదేవీలు మెరుగు పడటం వల్ల.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిస్థితులు కొద్దిగా మెరుగుపడవచ్చని, అయినప్పటికీ.. వాటితో పూర్వవైభవం వచ్చినట్టు భావించలేమని నివేదిక అభిప్రాయపడుతోంది.
2018-19 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికం ముగిసే నాటికి క్యాపెక్స్ నిధులు 79,200 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2017-18తో పోల్చుకుంటే ఈ మొత్తంలో పెరుగుదల కనిపించింది. గత ఆర్థిక సంవత్సరంలో క్యాపెక్స్ నిధులు మొత్తం 68,500 కోట్ల రూపాయల వరకు మాత్రమే నమోదయ్యాయి. ఈ సారి మాత్రం ఈ మొత్తం 79,200 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాలు ముగిసే సరికి 190 ప్రాజెక్టులకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మొత్తం 91,400 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశాయి. ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూసుకుంటే 451 ప్రాజెక్టుల ఆర్థిక ప్రణాళికల కోసం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు 1,15,800 కోట్ల రూపాయల వరకు రుణాలను మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2017-18 ఆర్థిక సంవత్సరంలో రుణ మంజూరులో మహారాష్ట్ర అత్యధిక వాటాను సాధించింది. ఆ సంవత్సరంలో మహారాష్ట్ర ఏకంగా 22.6 శాతం రుణాల మంజూరుతో అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర తరువాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ నిలిచాయి. గత ఏడాదితో పోల్చుకుంటే- గుజరాత్ వాటా క్షీణించడం గమనార్హం. బహుళ రాష్ట్రాల్లో చేపట్టదలిచిన ప్రాజెక్టుల మంజూరుల్లో కూడా చిక్కులు ఉన్నాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నిబంధనల్లో ఉన్న ఇబ్బందుల వల్లే ప్రాజెక్టుల మంజూరులో జాప్యం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.
2016-17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 916 కార్పొరేట్ సంస్థలు 2,02,800 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టగా.. ఆ మరుసటి ఆర్థిక సంవత్సరానికి వాటి సంఖ్య పడిపోయింది. 2017-18 నాటికి కార్పొరేట్ సంస్థల సంఖ్య 833కు, పెట్టుబడుల విలువ 1,99,100 కోట్ల రూపాయలకు దిగజారాయి.
పరిశ్రమల వారీగా చూసుకుంటే.. 2017-18 నాటికి రసాయన, రసాయన ఆధారిత ఉత్పత్తుల సంస్థల పెట్టుబడుల్లో 11 శాతం వృద్ధి రేటు కనిపించింది. 2012-13 నుంచి 2016-17లో నమోదైన పెట్టుబడులతో పోల్చుకుంటే ఈ రంగంలో 1.7 శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో నిర్మాణ రంగంలో పెట్టుబడుల వృద్ధి రేటు భారీగా పడిపోయింది. 12 నుంచి 5.1 శాతానికి దిగజారింది. మౌలిక రంగ పెట్టుబడుల్లో విద్యుత్ సంబంధిత ప్రాజెక్టుల పురోగమనం మెరుగుపడింది. అయినప్పటికీ.. దీని వాటా 45.4 శాతం నుంచి 43.8కి పడిపోవడం గమనార్హం.