మరో కొత్త నోటు ! తాజాగా రూ.20 నోటు సిద్దం చేసిన ఆర్బీఐ
ముంబై: త్వరలో కొత్త 20 రూపాయల నోట్లు దేశంలో చలామణిలోకి రానున్నాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న 20 రూపాయల నోట్లను కొనసాగిస్తూనే.. దానికి అదనంగా కొత్త కరెన్సీని అందుబాటులోకి తీసుకొస్తామని రిజర్వుబ్యాంకు వెల్లడించింది. దీనికి సంబంధించిన ముద్రణ తుదిదశలో ఉందని పేర్కొంది. కొత్తగా చలామణిలోకి వచ్చే నోట్లపై రిజర్వుబ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటుంది. రిజర్వుబ్యాంకు గవర్నర్ గా శక్తికాంత దాస్ బాధ్యతలను స్వీకరించిన తరువాత. ఆయన సంతకంతో కూడిన నోట్లు చలామణిలోకి రావడం ఇదే తొలిసారి. కొత్తనోటుకు సంబంధించిన నకలును విడుదల చేసింది.
ఈ సారి ఎల్లోరా గుహలు..
కొత్త నోట్లు ఆకుపచ్చ-పసుపు మిశ్రమ రంగులో ఉంటాయి. నోటు ముందు భాగంలో జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మ పెద్దగా ఉంటుంది. వెనక భాగంలో ఎల్లోరా గుహల బొమ్మలను ముద్రించారు. గాంధీ కళ్లద్దాల్లో స్వచ్ఛ భారత్ అనే సింబల్ ఉంది. నోటు వెనక భాగం ఎడమవైపు నోటును ముద్రించిన సంవత్సరాన్ని పొందుపరిచారు. ఇదివరకు కొత్తగా ముద్రించిన 50 రూపాయల నోటు వెనుక భాగంలో హంపీలోని ఏకశిలా రథాన్ని, 10 రూపాయల నోటుపై కోణార్క్ సూర్యదేవాలయాన్ని ముద్రించిన విషయం తెలిసిందే. అలాగే- కొత్త 100 రూపాయల నోటుపై గుజరాత్ లోని రాణి కీ వావ్ ను ముద్రించారు. ఈ సారి కొత్తగా చలామణిలోకి రాబోతున్న 20 రూపాయల నోటు వెనుక భాగంలో ఎల్లోరా గుహలను ముద్రించారు.
పాతవి కొనసాగుతాయి..
కొత్త 20 రూపాయల నోటు ముద్రణ ఇదివరకే ప్రారంభమైందని రిజర్వుబ్యాంకు వెల్లడించింది. త్వరలోనే బ్యాంకులకు విడుదల చేస్తామని పేర్కొంది. కొత్త 20 రూపాయల నోట్లు వచ్చినా.. పాత నోట్లు చలామణిలోనే ఉంటాయని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన, గందరగోళానికి గురి కావొద్దని సూచించింది.