పెద్ద నోట్లు: డిసెంబర్ 30 వరకు ఎటిఎం చార్జీల రద్దు
ముంబయి: నగదు కొరతతో కష్టాల పాలైన ప్రజలకు కాస్తా ఊరట కలిగించడానికి సోమవారం రిజర్వు బ్యాంకు మరో నిర్ణయం తీసుకుంది ఏటీఎంల ద్వారా జరిపే అన్ని లావాదేవీలపై డిసెంబరు 30వ తేదీ వరకు ఛార్జీలను రద్దు చేసింది. ఇది సేవింగ్స్ బ్యాంకు ఖాతాదార్లకు వర్తిస్తుంది.
తమ బ్యాంకుల ఏటీఎంలతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలలో ఎన్నిసార్లు లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర) జరిపినా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబోరని సోమవారం సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి నెలకు అయిదు సార్లు, ఆరు మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నెలకు మూడు సార్లు మాత్రమే ఉచితంగా లావాదేవీలు జరిపే అవకాశం ఉంది. ఈ పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి రూ.20 వంతున వసూలు చేస్తారు.
పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో కొత్త నోట్లు పొందడానికి పరిమితులు విధించడంతో ఏటీఎంల నుంచి పలుమార్లు నగదు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏటీఎం ఛార్జీలను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకొంది.
ఈ ఏడాది సెప్టెంబర్ చివరి లెక్కల ప్రకారం దేశంలో సగం అంటే2 లక్షల 18 వేల 542 ఎటిఎం కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. వంద రూపాయల నోట్లతో పాటు కొత్త 500, 2000 నోట్లకు అనుగుణంగా ఎటిఎం యంత్రాలను సరిచేయాల్సిన పరిస్థితిలో మిగతా ఎటిఎం కేంద్రాలు పడ్డాయి.
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎటిఎం కేంద్రాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. పాత నోట్ల మార్పిడి, డబ్బు డ్రా, నగదు డిపాజిట్ల కోసం ప్రజలు ఎటిఎం కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఆరు మెట్రో నగరాలు - ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్రకాస బెంగళూరు, హైదరాబాద్ల్లో సేవింగ్స్ ఖాతా హోల్టర్లకు నెలలో మూడు ఉచిత లావాదేవీల నిర్వహణకు అవకాశం కల్పిస్తున్నారు.