జయలలిత ఆర్ కే నగర్ మీద కన్ను: ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా: టీటీవీ దినకరన్, శశికళ నిర్ణయం!
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరించిన టీటీవీ దినకరన్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నానని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాను పోటీ చేస్తానని అంటున్నారు. అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు అందరూ శశికళ వెంటే ఉన్నారని టీటీవీ దినకరన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
చెన్నైలోని ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గానికి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించారు. జయలలిత ఆకస్మిక మరణంతో ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ వర్గం భారీ ఎత్తున ఓటర్లకు నగదు పంచిపెట్టిందని వెలుగు చూసింది.
దాదాపు రూ. 50 కోట్ల ఖర్చు చేశారని వెలుగు చూడటంతో ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు రద్దు చేశారు. డిసెంబర్ 31వ తేదీ లోపు ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు నిర్వహిస్తామని భారత ఎన్నికల కమిషన్ ఇప్పటికే చెప్పింది. ఈ నేపథ్యంలో తాను పోటీ చెయ్యడానికి సిద్దంగా ఉన్నానని టీటీవీ దినకరన్ సోమవారం మీడియాకు చెప్పారు.
అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ప్రధాన కార్యదర్శి శశికళ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఎవురు పోటీ చెయ్యాలో నిర్ణయిస్తారని, ఆమె అభ్యర్థి పేరు ప్రకటిస్తారని టీటీవీ దినకరన్ చెప్పారు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై సైతం ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో మాకే మద్దతు ఇస్తారని టీటీవీ దినకరన్ ధీమా వ్యక్తం చేశారు.