ఏప్రిల్ 5కి రెడీ: ఆ పుకార్లలో నిజం లేదు, రాష్ట్రాలకు విద్యుత్ శాఖ కీలక సూచనలు, ప్రజలకు కూడా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 5 పిలుపు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. కరోనాపై పోరాటంలో భాగంగా 130 కోట్ల మంది ప్రజల ఐక్యతను చాటేందుకు మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. చీకటి నుంచి వెలుగువైపునకు పయనించేందుకు ఏప్రిల్ 5, ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాలపాటు దేశ వ్యాప్తంగా లైట్లు ఆపివేసి చేసి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ లైట్లు, టార్చ్ లను వెలిగించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ప్రధాని మోడీ పిలుపు: ఏప్రిల్ 5 భారత విద్యుత్ రంగానికి అతిపెద్ద సవాలే! ఏం చేయాలంటే.?
అవాంఛనీయ ఘటనలు జరగకుండా..
ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్ శాఖ అన్ని విధాలా సిద్ధమైంది. ఇప్పటికే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి సంజీవ్ నందన్ సాహ్లీ లేఖ రాశారు. అందరూ ఒకేసారి లైట్లు ఆపివేయడం వల్ల గ్రిప్పై ఒకేసారి ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
లైట్లు మాత్రమే ఆపాలి..
ప్రధాని మోడీ తన పిలుపులో కేవలం లైట్లు మాత్రమే ఆపివేయాలని పిలుపునిచ్చారని.. అందువల్ల ఇంట్లోని ఫ్రిజ్, ఏసీ, టీవీ, కూలర్లు, తదితర వస్తువులను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేశారు. వీధి లైట్లు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. వీధి లైట్లు, శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అత్యవసర ప్రదేశాల్లో.. పుకార్లలో వాస్తవం లేదు..
అంతేగాక, ఆస్పత్రులు సహా అన్ని అత్యవసర ప్రదేశాల్లో లైట్లు ఆపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఒకేసారి లైట్లన్నీ ఆపేయడం వల్ల పవర్ గ్రిడ్లు కుప్పకూలిపోతాయంటూ వస్తున్న పుకార్లపైనా కేంద్ర విద్యుత్ శాఖ స్పందించింది. పవర్ గ్రిడ్లకు ఎలాంటి నష్టం వాటిల్లబోదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 5న కార్యక్రమానికి అన్ని విధాలా విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు.
Recommended Video
దీపాలు వెలిగించేవారికి జాగ్రత్తలు..
ఇది ఇలావుండగా, ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు లైట్లు ఆపివేసి.. దీపాలు వెలిగించే సమయంలో ప్రజలెవరూ కూడా చేతులకు శానిటైజర్ పూసుకోవద్దని ప్రభుత్వంతోపాటు నిపుణులు చెబుతున్నారు. శానిటైజర్లో ఆల్కహాల్ ఉన్నందున దానికి మండే గుణం ఉంటుందని, అందువల్ల దీపాలు వెలిగించే సమయంలో చేతులకు శానిటైజర్లను రాసుకుంటే మంటలు వ్యాపించే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయం పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని పిలుపునిస్తున్నారు.