కనీస మద్దతు ధరపై లిఖిత పూర్వ హామీకి సిద్దం... కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు...
రైతులకు కనీస మద్దతు ధరపై లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. కనీస మద్దతు ధర విషయంలో ఎటువంటి మార్పు ఉండదని తాను భరోసా ఇస్తున్నానన్నారు. అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ)లను బలోపేతం చేయడం కూడా తమ ప్రాధాన్యతల్లో ఒకటని తెలిపారు. రైతులు లేవనెత్తుతున్న డిమాండ్లను పరిశీలించేందుకు తాము సుముఖంగా ఉన్నామని నరేంద్ర తోమర్ పేర్కొన్నారు. చర్చల ద్వారా అన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నామన్నారు. శుక్రవారం (డిసెంబర్ 4) ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి నరేంద్ర తోమర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
శనివారం(డిసెంబర్ 4) కేంద్రంతో రైతులు మరో దఫా చర్చలు జరపబోతున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. నిజానికి గురువారం(డిసెంబర్ 3) నాటి చర్చలే కేంద్రానికి చివరి అవకాశం అని ప్రకటించిన రైతులు...కేంద్ర ప్రభుత్వానికి మరో అవకాశం ఇచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని రైతులు పట్టుబడుతుండగా... దానికి సవరణలు చేస్తామని కేంద్రం చెబుతోంది. రైతులు మాత్రం సవరణలతో సంతృప్తి చెందేది లేదని... వాటిని రద్దు చేయాలన్నదే తమ డిమాండ్ అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం జరగబోయే చర్చల్లో ఎటువంటి పురోగతి లభించబోతుందన్న ఆసక్తి నెలకొంది.
ఒకవేళ రేపటి(డిసెంబర్ 4) చర్చలు కూడా సఫలం కాకపోతే రైతు ఉద్యమం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 8న రైతు సంఘాలు ఇప్పటికే భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. కాగా, గత 9 రోజులుగా ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధించి పంజాబ్,హర్యానా రైతులు కేంద్రంపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో రైతులపై పోలీసులను ప్రయోగించిన కేంద్రం... ఆ తర్వాత చర్చలకు ఆహ్వానించింది. ఇప్పటికే రెండు విడతల చర్చలు విఫలమయ్యాయి. గురువారం(డిసెంబర్ 3) సుమారు 7గంటల పాటు సుదీర్ఘంగా సాగిన చర్చలు ఏ అంశం కొలిక్కి రాకుండానే అసంపూర్తిగానే ముగిశాయి.