ఎన్టీఆర్కు ఏం చేశారో తెలుసు, నేను చేసిన నేరం అదే: లోకసభలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం లోకసభలో మాట్లాడారు. విపక్షాలకు తనదైన శైలిలో చురకలు అంటించారు. ప్రజలకు తాము నీతిమంతమైన పాలన అందిస్తున్నామని చెప్పారు. బీసీ అంటే బీఫోర్ కాంగ్రెస్, ఏడీ అంటే ఆఫ్టర్ డైనాస్టీ అని కాంగ్రెస్ పార్టీపై సెటైర్ వేశారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
తాము అవినీతిరహిత పాలన అందించామని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా అనేక చర్యలు చేపట్టామన్నారు. ఎన్డీయే ప్రభుత్వం విజయాలు అవినీతిరహిత పాలనకు నిదర్శనమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. మోడీ, బీజేపీ ఆలోచనలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశానికి చెడు చేస్తోందన్నారు.
వ్యవస్థల నిర్వీర్యం అబద్ధం
నిజాలు చెప్పేవాళ్లు సభలో, సభ బయటా ఒకటే మాట్లాడుతారని చెప్పారు. నిజాలు వినే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. 55 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ చేయలేదనిది తాము 55 నెలల్లో చేసి చూపించామని అన్నారు. పేదరిక నిర్మూలనకు తాము చిత్తశుద్ధితో పని చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతకు అభినందనలు తెలిపారు. 21వ శతాబ్ధంలో పుట్టిన వారు ఓటు హక్కు వినియోగించుకుంటారని నవ భారత నిర్మాణంలో వారి పాత్ర ఉంటుందన్నారు. భారత్లోనే అత్యధికంగా డేటా వినియోగిస్తున్నారని చెప్పారు తాము వ్యవస్థలను నిర్వీర్యం చేశామనేది శుద్ధ అబద్దమని చెప్పారు. పదికోట్ల మంది ధనిక ప్రజల కోసం తాము మరుగుదొడ్లు నిర్మించామని మోడీ సెటైర్లు వేశారు. పేదలకు మరుగుదొడ్లు నిర్మించడాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పైన సెటైర్ వేసారు.
నాలాంటి కామన్ మ్యాన్ వారసత్వాన్ని సవాల్ చేస్తున్నారు
విజయాలకు నిదర్శనం ఎన్డీయే అన్నారు. తమ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తోందన్నారు. అవినీతికి వ్యతిరేకం అన్నారు. 2004, 2009లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన పనులు నెరవేర్చలేదన్నారు. దోపిడీదారులు దోచుకునే సమయంలో కాంగ్రెస్ చేతులు కట్టుకొని కూర్చుందన్నారు. తాము మాత్రం దోపిడీదారులను భారత్కు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. సవాళ్ల నుంచి మేం పారిపోమని చెప్పారు. తాము సవాళ్లను ఎదుర్కొంటామన్నారు. తనలాంటి సామాన్య వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను సవాల్ చేయడం ఆ పార్టీ జీర్ణించుకుపోలేకపోతోందన్నారు.
ఎన్టీఆర్కు ఏం చేశారో తెలుసు
ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు. గత నాలుగేళ్లలో భారత్ ఎంతో ప్రగతి సాధించిందని చెప్పారు. తనను వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్ దేశానికి ఎంతో నష్టం చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఆర్మీకి కనీసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వలేదన్నారు. తమ ఓటమిని కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల పైకి నెడుతోందన్నారు. సంస్థలను నిర్వీర్యం చేశారని కాంగ్రెస్ చెబుతోందని, కానీ గతంలో ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు), ఎంజీఆర్లకు ఏం చేశారో తెలుసునని చెప్పారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టిన విషయాన్ని గుర్తు చేశారు. పైగా కాంగ్రెస్ తనపై విమర్శలు గుప్పించడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే చాలా డీసెంట్ వ్యక్తి అని, కానీ అందుకు భిన్నంగా కనిపిస్తున్నారన్నారు.
వారసత్వాన్ని సవాల్ చేయడం నేను చేసిన క్రైమ్
తమ నాలుగున్నరేళ్ల పాలన కారణంగా భారత్ ఆరో లార్జెస్ట్ ఎకనమీగా నిలిచిందని చెప్పారు. నేను చేసిన క్రైమ్ ఏమంటే పేద కుటుంబంలో పుట్టి, సుల్తానులను (కాంగ్రెస్ వారసత్వం) సవాల్ చేయడమే తప్పు అని కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. 55 ఏళ్లలో 38 శాతం శానిటేషన్ ఉంటే, ఈ అయిదేళ్లలో 98 శాతానికి పెరిగిందని చెప్పారు. 55 ఏళ్లలో వారు చేయలేని వాటిని ఎన్నో మేం 55 నెలల్లో చేశామన్నారు. అభిశంసన పేరుతో న్యాయవ్యవస్థను భయపెట్టే ప్రయత్నం చేశారన్నారు. వాయుసేన బలోపేతం కావడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదన్నారు. అందుకే రాఫెల్ డీల్ వెనుక కాంగ్రెస్ పడిందని, విమర్శలు చేస్తోందన్నారు. ఏ కంపెనీ దళారితనం చేస్తుందో నాకు తెలుసునని చెప్పారు.