కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే, నేనే సీఎం అభ్యర్థిని: మహారస్ట్ర స్టేట్ చీఫ్ నానా పటోల్ హాట్ కామెంట్స్
ముంబై: మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో కలకలం రేపుతున్నాయి. సోమవారం అకోలాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
అంతేగాక, తాను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటానని నానా పటోల్ తేల్చి చెప్పారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని వ్యాఖ్యానించారు. తనను సీఎం అభ్యర్థిగా ఉండాలని పార్టీ కార్యకర్తలు, ప్రజలు కోరుకుంటున్నారని, తాను సీఎం అభ్యర్థిగా ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని నానా పటోల్ ధీమా వ్యక్తం చేశారు.
అయితే, నానా పటోల్ వ్యాఖ్యలను ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కొట్టిపారేశారు. కలలు ఎవరైనా కలలు కనవచ్చునని, పొత్తు ఉంటుందా? లేదా అనేదానిపై తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గానీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గానీ, ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే గానీ తీసుకుంటారని అజిత్ పవార్ తెలిపారు.
మరోవైపు, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పదవిలోకి కూటమిలోని ఇతర పార్టీకి చెందని వ్యక్తి వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం మార్పు ఉండవచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నానా పటోల్ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
Recommended Video
ఇటీవల సీఎం ఉద్ధవ్ థాక్రే.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో లుకలుకలు బయటపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, తాజాగా, జరుగుతున్న ప్రచారాలను శివసేన కొట్టిపారేసింది. ప్రధాని మోడీతో రాజకీయాలపై చర్చించలేదని, మహారాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాలపైనే ఉద్ధవ్ చర్చించినట్లు శివసేన పేర్కొంది.