హర్యానా బీజేపీకి షాకిస్తారా?: రైతులకు జేజేపీ ఎమ్మెల్యేల మద్దతు, రాజీనామాకు సిద్దమని ప్రకటన
ఛండీగఢ్: కేంద్ర తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా ఇద్దరు జన నాయక్ పార్టీ(జేజేపీ) ఎమ్మెల్యేలు రోడ్లపైకి వచ్చారు. కాగా, హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో జేజేపీ భాగస్వామి పక్షంగా ఉంది. అంతేగాక, ఈ పార్టీకి చెందిన కీలక నేత దుష్యంత్ చౌతాలా ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
కాగా, బర్వాలా ఎమ్మెల్యే జోగి రాం సిహాగ్, షాహబాద్ ఎమ్మెల్యే రాం కరణ్ కాలా రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతుగా నిలిచారు. హిసార్ జిల్లాలో రైతుల నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. హిసార్-ఛండీగఢ్ లను కలుపుతూ వెళ్లే హైవేపై నిరసనలు చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.
ఈ సందర్భంగా బర్వాలా ఎమ్మెల్యే జోగి మాట్లాడూ.. తన నియోజకవర్గ ప్రజలు రాజీనామా చేయమంటే చేస్తానని అన్నారు. వ్యవసాయ బిల్లులు తాను మొదట రైతులకు మేలు చేసేవనని అనుకున్నానని, అయితే, ఆ బిల్లులు చదివిన తర్వాత వాటిని వ్యతిరేకించానని తెలిపారు. ఆ బిల్లులు అమలైతే రైతులు మరింత ఇబ్బందులకు గురవుతారని అన్నారు.
రైతులు వారి పంటను అమ్ముకోవడానికి అనేక వ్యయప్రయాసలకు గురవుతారని చెప్పారు. ప్రైవేటు వ్యక్తులు పంటను కొంటే ధరలు మరింత ఎక్కువవుతాయని అన్నారు. సామాన్యులపై భారపడుతుందని చెప్పారు. ఇప్పుడు కొనసాగుతున్న ప్రక్రియే రైతులకు మేలు చేసేదిగా ఉందని తెలిపారు.
షాహబాద్ ఎమ్మెల్యే రామ్ కరణ్ కాలా మాట్లాడుతూ.. రైతుల సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. రైతుల పోరాటానికి తన మద్దతు ఉంటుందని వారు చేస్తున్న ధర్నాలో పాల్గొని వ్యాఖ్యానించారు.
90 మంది గల హర్యానా అసెంబ్లీలో జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం కొనసాగడానికి ఈ పార్టీ మద్దతు ఎంతో అవసరం. ఒక వేళ వీరు బిల్లులకు వ్యతిరేకంగా రాజీనామా చేసినా.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నా.. బీజేపీ సర్కారు కూలిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే బీజేపీ చిరకాల మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ కూడా ఎన్డీఏతో తెగదెంపులు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.