షాకింగ్ నిజం .. పెద్ద కష్టం .. ఆ 132 గ్రామాల్లో మూడు నెలల్లో ఒక్క ఆడపిల్ల పుట్టలేదట
షాకింగ్ నిజం... చాలా పెద్ద కష్టం ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆలోచించేలా చేస్తోంది. ' బేటి బచావో బేటి పడావో ' అన్న నినాదం మాటలకే పరిమితం అవుతోంది. విన్నంతనే ఉలిక్కిపడే వార్త , ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే వార్త, ఆందోళనకు గురిచేసే వార్తగా ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక వార్త దేశాన్ని అవాక్కయ్యేలా చేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 132 గ్రామాల్లో గడిచిన మూడు నెలలుగా ఒక్కరంటే ఒక్క ఆడపిల్ల కూడా పుట్టని వైనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ పేరు? ఫైనల్ గా పీవీ సింధు?
గడిచిన మూడు నెలల్లో 132 గ్రామాలలో అందరూ మగపిల్లలే
భ్రూణ హత్యలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఈ ఘటన అద్దం పడుతుందని సామాజిక వేత్తలు ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గడిచిన మూడు నెలల్లో 132 గ్రామాలలో ఒక ఆడపిల్ల కూడా పుట్టలేదు. మొత్తం 132 గ్రామాలలో 216 మంది పిల్లలు పుట్టినా వారంతా మగపిల్లలు కావడం గమనార్హం. ఇది అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నటువంటి విషయం. మూడు నెలలుగా 132 గ్రామాలలో ఒక ఆడపిల్ల కూడా ఎందుకు పుట్టలేదనే విషయంపై అటు ప్రభుత్వ అధికారులు సైతం సీరియస్ గా ఉన్నారు. సర్వే చేయిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆశిష్ సోహన్ ప్రకటించారు.
భ్రూణ హత్యలే ఆడపిల్లలు పుట్టకపోవటానికి కారణం అని చెప్తున్న సామాజిక కార్యకర్తలు
ఇక అసలు విషయానికొస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భ్రూణ హత్యలు విపరీతంగా జరుగుతున్నాయని, దానివల్లనే ఆడ శిశువు గర్భంలో ఉందని తెలిస్తే గర్భంలోని ప్రాణం తీస్తున్నారని, అబార్షన్లు చేయిస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గర్భం దాల్చిన వెంటనే.. అనధికారికంగా పుట్టేది అమ్మాయా? అబ్బాయా?అన్న విషయాన్ని తెలుసుకుంటున్న తల్లిదండ్రులు ఆడపిల్ల అయితే భ్రూణహత్యలు చేయిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ ఉదంతంపై లోతుగా దర్యాప్తు చేయాలని, భ్రూణ హత్యలను ఆపడానికి, ఆడపిల్లల జనన శాతాన్ని పెంచడానికి ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని కోరుతున్నారు.
సర్వే నిర్వహించి .. అవగాహన కల్పించి ... చర్యలు తీసుకుంటామంటున్న అధికార యంత్రాంగం
ఇక అధికారులు 132 గ్రామాలలో ఒక్క ఆడపిల్ల కూడా పుట్టకపోవటాన్ని తాము సీరియస్ గా తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం వెలుగు చూసినంతనే.. ఈ విషయానికి అత్యధిక ప్రాధాన్యాన్ని ఇస్తూ ఆశా కార్యకర్తలతో జిల్లా కలెక్టర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.సామాజిక చైతన్యం లోపించటం, ఆడపిల్లలైనా , మగపిల్లలయినా ఇద్దరూ సమానమనే భావన లేకపోవడం, గ్రామీణుల్లో అవగాహన కల్పించటంలో అధికారులు విఫలం కావటం కూడా ఈ దారుణ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ఇక భ్రూణహత్యలు నేరమని చెప్తున్న చట్టాలున్నప్పటికీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అవి పాటించడంలేదని అందుకే అక్కడ 132 గ్రామాలలో మూడు నెలల్లో ఒక ఆడపిల్ల కూడా పుట్టలేదని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశం. సృష్టికి మూలాధారమైన ఆడపిల్లల ఉనికే ప్రశ్నార్థకం అయితే , భూమి మీద పడకుండానే విగతజీవులుగా మారితే మానవ మనుగడ ప్రమాదంలో పడినట్టే. ఈ పరిస్థితులు మారేలా, వారిలో అవగాహన వచ్చేలా గట్టిగా కృషి చేయాల్సిన అవసరం సదరు ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది.