దెబ్బ గట్టిగానే తగిలింది!: కోర్టు అక్షింతలేస్తే గానీ.. అర్నబ్కు సీన్ అర్థం కాలేదు!
శశిథరూర్ కాస్త కోర్టు మెట్లెక్కడంతో అర్నబ్ రిపబ్లిక్ మీడియాకు మొట్టికాయలు తప్పలేవు. న్యాయస్థానంలో ఉన్న కేసు పట్ల మీరెలా తీర్పులిస్తారంటూ ఢిల్లీ హైకోర్టు గట్టిగానే మందలించింది.
న్యూఢిల్లీ: జనంలో ఓ వ్యక్తి ఇమేజ్ పెరగాలన్నా.. తగ్గాలన్నా.. అదంతా అతనికి లభించే పబ్లిసిటీ పైనే ఆధారపడి ఉంటుంది. సదరు వ్యక్తికి మీడియా మేనేజ్ మెంట్పై అవగాహన ఉంటే.. ఆ పని మరింత సులువవుతుంది. ఒకవేళ అధికారంలో ఉన్న వ్యక్తయితే అది మరింత సులువు.
ఓవర్ నైట్ పబ్లిక్ ఫిగర్ గా గుర్తింపు తెచ్చుకున్నా.. రాత్రికే రాత్రే ఉన్న ఇమేజ్ అమాంతం పడిపోయినా అంతా మీడియా చలవే. అయితే ఇందులో నిజనిజాలు నిష్పక్షపాతంగా ఉంటే ఎవరికీ అభ్యంతరాలు ఉండవు గానీ.. ఇంకా కోర్టు కేసుల్లో నలుగుతున్న అంశాలపై కూడా టీవీలే తీర్పునిచ్చే పనిని ముందేసుకుంటే మాత్రం అక్షింతలు తప్పవు.
మనదేశంలో చాలావరకు మీడియా సంస్థలు ఇప్పుడదే పని చేస్తున్నాయి. రియాలిటీ షోల పేరిట విడిపోయిన దంపతులను కలిపేసే తీర్పులు చెప్పడం.. లేదా ఉద్దేశపూర్వకంగా వ్యక్తుల ఇమేజ్ దెబ్బతీసేలా న్యూస్ చానెళ్లలో కథనాలను ప్రసారం చేయడం చాలారోజులుగా జరుగుతున్నదే. మొన్నీమధ్యే ఓ టీవీ ఛానెల్ తమ యాడ్ మార్కెట్ కోసం ఓ వ్యక్తిని బకారా చేసే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయిపోయింది కూడా.
షాక్: సునంద పుష్కర్ మృతి: ఆడియో టేపులు బయటపెట్టిన అర్నబ్ గోస్వామి!
సరే, ఈ సంగతంతా పక్కనబెడితే.. ఇటీవలే మీడియా సామ్రాజ్యంలోకి మరోసారి ఘనంగా ఎంట్రీ ఇచ్చిన అర్నబ్ గోస్వామి కూడా మీడియా అసలు ఉద్దేశాన్ని మరిచిపోయినట్లున్నారు. తానే న్యాయస్థానం అన్నట్లు వ్యవహరించి సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో శశి థరూరే దోషి అని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఆడియో టేపులు అంటూ చేసిన హంగామా కూడా ఆయన మీడియా సంస్థను విమర్శలు పాలయ్యేలా చేసింది.
శశిథరూర్ కాస్త కోర్టు మెట్లెక్కడంతో అర్నబ్ రిపబ్లిక్ మీడియాకు మొట్టికాయలు తప్పలేవు. న్యాయస్థానంలో ఉన్న కేసు పట్ల మీరెలా తీర్పులిస్తారంటూ ఢిల్లీ హైకోర్టు గట్టిగానే మందలించింది. నారాయణన్ అనే వ్యక్తి లైవ్ లో ఏదో చెప్పినంత మాత్రానా.. శశిథరూర్ దోషి అని నిర్ధారిస్తారా? అంటూ ప్రశ్నించింది. దీంతో అర్నబ్ తరుపు న్యాయవాది సందీప్ సేథీ నీళ్లు నమలాల్సి వచ్చింది. ఇక చేసేదేమి లేక ఇలాంటి తప్పిదాలు మరోసారి జరగకుండా జాగ్రత్తపడుతామని వివరణ ఇచ్చుకున్నాడు.
అంటే, వ్యవహారం కోర్టు దాకా వెళ్లి న్యాయమూర్తి అక్షింతలు వేస్తే తప్పితే.. మన మీడియాకు తామెలాంటి విలువలు పాటిస్తున్నామో ఆలోచించుకునే సమయం లేదన్నమాట. ఇదీ సంగతి.