అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి తెలీదు గానీ..బీజేపీ బలహీనపడింది: ప్రియాంకా గాంధీ
లక్నో: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంత ఇన్ ఛార్జి ప్రియాంకా గాంధీ స్పందించారు. ఎన్నికల తాజా ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయం తనకు తెలియదని, ఇంతకుముందే వార్తల ద్వారా తెలుసుకున్నానని అన్నారు. హర్యానాలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు భారీగా ప్రభావాన్ని చూపాయని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో కూడా తమ పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని చెప్పారు.
దుష్యంత్ కే పట్టం: హుడా కుమారుడికి డిప్యూటీ: హర్యానాలో కాంగ్రెస్-జేజేపీ సంకీర్ణ సర్కార్:
గురువారం ఆమె ఉత్తర్ ప్రదేశ్ లోని రాయబరేలీ పర్యటనకు వచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంతం పరిధిలోని లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణులతో సంప్రదింపులు నిర్వహిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీని క్యాడర్ ను సమాయాత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాయబరేలీకి వచ్చిన ప్రియాంకా గాంధీ వాద్రా స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రస్తుతం తన దృష్టి అంతా ఉత్తర్ ప్రదేశ్ మీదే ఉందని, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి పట్టించుకోలేదని అన్నారు.
హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకొచ్చారని, ఇది మంచి పరిణామం అని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ బలహీన పడిందనడానికి ఈ ఎన్నికలే ఉదాహరణ అని చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన సంకీర్ణ కూటమి ఎక్కువ రోజులు అధికారంలో కొనసాగకపోవచ్చని ఆమె అంచనా వేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో నిర్వహించిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని, ఇదే ఊపును కొనసాగిస్తామని అన్నారు. తాజాగా ఫలితాలు, పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమౌతున్నాయని ప్రియాంకా గాంధీ చెప్పారు.