కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం, ఆపరేషన్ కమల, పరుగో పరుగు, కష్ట కాలం వచ్చిందా !
బెంగళూరు: లోక్ సభవ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత కర్ణాటక రాజకీయాల్లో భారీ మార్పులు కనపడే అవకాశం ఉందని వెలుగు చూసింది. ఇన్ని రోజులు అతి కష్టం మీద కాపాడుకుంటూ వచ్చిన కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి కష్ట కాలం ఎదురౌయ్యింది.
కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు శుక్రవారం బెంగళూరులో అత్యవసర రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. రెబల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్ జారకిహోళి, అథణి ఎమ్మెల్యే మహేష్ కుమటళ్ళి ఆధ్వర్యంలో కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు సమావేశం అవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన మరి కొంత మంది రెబల్ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరౌతారని సమాచారం. గురువారం లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. కర్ణాటకలో బీజేపీకి 25 పీఎం స్థానాలు వచ్చాయి. బీజేపీ మద్దతుతో మండ్యలో విజయం సాధించిన స్వతంత్ర పార్టీ అభ్యర్థి సుమలతతో కలుపుకుంటే బీజేపీకి 26 ఎంపీ సీట్లు వచ్చాయి.
కర్ణాటకలో 26 ఎంపీ సీట్లు కట్టబెట్టి కేంద్రంలో ఎన్డీఏకి అవకాశం కల్పించిన కన్నడిగులు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయ్యింది. ఈ సందర్బంలో ఆపరేషన్ కమల మళ్లీ తెరమీదకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని వెలుగు చూడటంతో ఇంతకాలం అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరుకు పరుగు తీస్తున్నారు. శుక్రవారం ఉదయం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ ఇంటిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అల్పాహారం సేవించి చర్చలు జరిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎందుకు చితకలబడింది అనే విషయంపై రచ్చలు జరిగాయని సమాచారం.